Committee Kurrollu 50 Days Event: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. అన్ని వర్గాల వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సంద‌ర్భంగా ‘కమిటీ కుర్రోళ్లు’ 50 రోజుల వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో సినిమా టీమ్ అంతా పాల్గొని మాట్లాడారు.


నేషనల్ అవార్డు కొట్టాలి...
ప్రముఖ నటుడు, నిర్మాత, నిహారిక కొణిదెల తండ్రి అయిన నాగ‌బాబు... కమిటీ కుర్రోళ్లు’ విజయంలో భాగ‌మైన చిత్ర బృందం అంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. దర్శకుడు య‌దు వంశీ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడని కితాబిచ్చారు. నటీనటులు అందరూ చాలా చ‌క్క‌గా న‌టించారని అన్నారు. సినిమా చూస్తున్నంత‌సేపు ఆయనకి కూడా చిన్న‌నాటి రోజులు గుర్తుకు వ‌చ్చాయని తెలిపారు. ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు సాధించ‌టానికి అన్నీ అర్హ‌త‌లున్న సినిమా ఇదే అన్నారు. నిహారిక ఇలాంటి సినిమా నిర్మించ‌టం తనకు చాలా గొప్ప‌గా అనిపిస్తుందని పేర్కొన్నారు.


రుద్రవీణకు ప్రేక్షకుడిని... గుడుంబా శంకర్‌కి డిస్ట్రిబ్యూటర్‌ని...
దిల్‌రాజు మాట్లాడుతూ... నాగబాబు నిర్మించిన రుద్రవీణ చిత్రానికి తాను ప్రేక్ష‌కుడిని అని, గుడుంబా శంక‌ర్ చిత్రానికి డిస్ట్రిబ్యూట‌ర్‌ని అని తెలిపారు. ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత‌లు నిహారిక‌, ఫ‌ణికి అభినంద‌న‌లు తెలిపారు. చిత్ర స‌మ‌ర్ప‌కురాలు నిహారిక కొణిదెల... ‘కమిటీ కుర్రోళ్లు’ సక్సెస్‌లో భాగ‌మైన అందరికీ థాంక్స్‌ చెప్పారు. దర్శకుడు యదు వంశీతో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తండ్రి నాగబాబు అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌ అన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలిపారు.


హెల్త్ బాగోకపోయినా 10 రోజుల పాటు...
చిత్ర దర్శ‌కుడు య‌దు వంశీ మాట్లాడుతూ... ఈరోజుల్లో 50 రోజులు సినిమా పూర్తి చేసుకోవ‌టం అనేది అరుదుగా జ‌రుగుతుంటుందన్నారు. తమ తొలి సినిమాకే ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదని తెలిపారు. సినిమాలో వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.  నిహారిక‌ హెల్త్ బాగోలేన‌ప్పుడు కూడా 10 రోజుల పాటు సినిమా టీమ్‌తో ట్రావెల్ చేశారన్నారు. నిహారిక‌ బ్యాన‌ర్‌లో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నానన్నారు. నాగ‌బాబు ప్రోత్సాహంతో ఇక్క‌డ వ‌ర‌కు వ‌చ్చామని పేర్కొన్నారు.


నిర్మాత‌ల్లో ఒక‌రైన ఫ‌ణి అడ‌పాక మాట్లాడుతూ... కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు పని చేసిన టీమ్ సభ్యులందరికీ ఈ సినిమా ప్రారంభ‌మైన విజ‌యం.. ఇంకా గొప్ప విజ‌యాల‌తో కొన‌సాగాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు య‌దు వంశీ తొలి సినిమాతో చాలా మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారని తెలిపారు. సినిమాను ఎలాగైతే నెరేట్ చేశాడో.. అదే ఎమోష‌న్‌తో సినిమాను తెర‌కెక్కించారని పేర్కొన్నారు. నిహారికకి స్పెష‌ల్ థాంక్స్‌ తెలిపారు. ఇలాంటి క‌థ‌కు పింక్ ఎలిఫెంట్ వంటి సంస్థ అవ‌స‌రం ఉందన్నారు. అనంతరం ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికీ 50 డేస్ మెమొంటోని బ‌హూక‌రించారు.



Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?