సినీ నటుడు, నిర్మాత నాగబాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే బ్రాండ్ ఉన్నా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నాగబాబు. మెగా ఫ్యామిలీ పై ఎవరైనా విమర్శలు చేస్తే మొదటిగా స్పందించేది నాగబాబే. తమపై విమర్శలు చేసే వారిపై కౌంటర్ లు ఇస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారాయన. ఈ నేపథ్యంలో ఇటీవల నాగబాబు ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన కు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) పై కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. 


నాగబాబు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరొందారు. కెరీర్ ప్రారంభంలోనే 'అంజనా ప్రొడక్షన్స్' ను ప్రారంభించి హిట్ సినిమాలు తీశారు. 'రుద్రవీణ' నుంచి 'ఆరెంజ్' సినిమా వరకూ పలు చిత్రాలను నిర్మించారు నాగబాబు. తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించిన నాగబాబు, బుల్లితెరపై కూడా తన మార్క్ ను ప్రదర్శించారు. 'జబర్దస్త్' లాంటి షో లతో మరింత ఆదరణ పొందారు నాగబాబు. కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండే నాగబాబు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో కూడా కీలక వ్యక్తి గా పార్టీలో పనవ్ కళ్యాణ్ వెంట నిలబడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 


జనసేన పార్టీ పై చేసే విమర్శలకు ప్రతివిమర్శలు చేసే నాగబాబు ఇటీవల కొంతమంది విమర్శలకు ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కొంతమంది చేసే విమర్శలపై స్పంచించాల్సిన పనిలేదన్నారు నాగబాబు. పోసాని మురళి లాంటి వ్యక్తుల పేర్లు తన నోటితో పలకడం కూడా ఇష్టం లేదని పేర్కొన్నారు. రాజకీయంగా చేసే విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తున్నారని, అందుకే తాను అంతగా కలుగజేసుకోలేవట్లేదని అన్నారు. అధ్యక్షుడు స్థాయిలో విమర్శలకు అధ్యక్షుడే సమాధానాలు చెప్తారని అన్నారు. ఇక మా అసోసియేషన్ గురించి మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడాలని నిజానికి మంచు మోహన్ బాబు కి, విష్ణు కి లేదని, కొంతమంది వ్యక్తులే వాళ్ళని తప్పుదోవ పట్టించారని అన్నారు. ముఖ్యంగా నరేష్ లాంటి వ్యక్తుల వల్లే మా అసోసియేషన్ అలా తయారైందని వ్యాఖ్యానించారు. నరేష్ మాటల వల్లే మా అసోసియేషన్ ఎన్నికల్లో అన్ని గొడవలు జరిగాయని పేర్కొన్నారు.


Also Read : 'యశోద'కు, నయనతార సరోగసీ ఇష్యూకు సంబంధం లేదు


నరేశ్ తనని తాను దైవాంశ సంభూతుడిగా ఫీల్ అవుతుంటాడని, 'మా' లో  గొడవలు సృష్టించి తద్వారా తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అవ్వాలని అనుకున్నాడని, కానీ అవన్నీ జరగలేదని నాగబాబు అన్నారు. జబర్దస్త్ కి తనకూ మధ్య ప్రస్తుతం విభేదాలు ఏమి లేవని, వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా మళ్ళీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నానని హింట్ ఇచ్చారు నాగబాబు. మరి దీనిపై మల్లెమాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.