‘చలో’ సినిమా తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయిన నాగశౌర్య.. ‘వరుడు కావలెను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరోయిన్ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని ‘‘దిగు దిగు నాగా..’’ సాంగ్ వివాదంలో చిక్కుకోవడంతో ఈ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగాయి. 


ప్రేమమ్, బాబు బంగారం, శైలజా రెడ్డి అల్లుడు, జెర్సీ, రణరంగం, భీష్మ, రంగ్‌దే సినిమాలను నిర్మించిన సితారా ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రయూనిట్ మంగళవారం ‘వరుడు కావలెను’ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని మహిళ పాత్రలో రితూ వర్మ కనిపిస్తుంది. ఎప్పుడూ సీరియస్‌గా ఉంటూ చిరుబుర్రులాడే ఆమెను ప్రేమలో పడేయడానికి నాగశౌర్య పడే పాట్లు.. వెన్నెల కిశోర్ పంచులతో టీజర్ సరదాగా సాగిపోతుంది. చూస్తుంటే.. ఈ చిత్రం తప్పకుండా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది. 


రీతూను ప్రేమలో పడేయడానికి శౌర్య చేసే ప్రయత్నాల గురించి వెన్నెల కిశోర్ చెప్పే డైలాగులు బాగున్నాయి. ‘‘మీ బాస్ ఏమిటి భయ్యా.. ఎడారిలో ఐస్ తయారు చేయాలని చూస్తున్నాడు?’’ అని అంటారు. ‘‘ప్రతి బాల్‌ను సిక్స్ కొట్టే బ్యాట్స్‌మ్యాన్‌ను చూశావా? మా వాడు కొడతాడు’’ అని కమెడియన్ ప్రవీణ్ అంటే.. ‘‘ప్రతి బాల్‌ను నోబాల్ ఇచ్చే అంపైర్‌ను చూశావా? ఆవిడ ఇస్తుంది’’ అనే డైలాగ్‌తో టీజర్ ముగిసింది.


‘వరుడు కావలెను’ సినిమా టీజర్‌ను ఇక్కడ చూడండి:


 ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.