నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. గురువారం చిత్రయూనిట్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌పై మీరూ ఓ లుక్ వేసేయండి మరి. 


‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్:



టీజర్ ఎలా ఉంది?


టీజర్ మొత్తంలో నాగశౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్ మాత్రమే కనిపించారు. ‘‘ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయనది ఏమనగా.. సంజయ్ పీచపాటి మరియు అనుపమా కస్తూరీ బెస్ట్ ఫ్రెండ్స్ అహో’’ అంటూ మాళవిక నాయర్ వాయిస్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్‌గా క్లోజ్‌గా ఉండటం, ‘‘పాత్రకు అవసరమైతే ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తా’’ అని నాగశౌర్య అనడం, ‘‘పెళ్లయిన తర్వాత కూడా నటిస్తా’’ అంటూ మాళవిక చెప్పడం.. వంటి సరదా సీన్స్ నవ్విస్తాయి. అయితే, ‘‘నాకు, అనుకు మధ్య అలాంటిది ఏమీ లేదు’’ అని నాగశౌర్య చెప్పడం, కట్ చేస్తే.. వారిద్దరు ముద్దుపెట్టుకోనే సీన్ షాకిస్తుంది. ఆ తర్వాత నాగశౌర్య ‘‘ఉయ్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్’’ అని క్లారిటీ ఇవ్వడం, చివరి సీన్లో ‘‘నా దగ్గర పాతవేవీ లేవు. అన్నీ డిస్పోజ’’ అని చెప్పడంతో టీజర్ ముగిసింది. ఈ టీజర్ ప్రకారం.. యంగ్ ఏజ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నవారు అనివార్య కారణాలతో విడిపోవడం.. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారిద్దరి జీవితాలు ఎలా మలుపుతిరుగుతాయనేదే కథ అని తెలుస్తోంది. 


నాగశౌర్యకు సరైన హిట్ దొరికి చాలా రోజులవుతోంది. శౌర్య కెరీర్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘చలో’, ‘జో అచ్చుతానంద’, ‘హే బేబీ’ వంటి సినిమాలు మాత్రమే మంచి ఫలితాలిచ్చాయి. గత కొన్నాళ్లుగా శౌర్య సినిమాలైతే వస్తున్నాయి కానీ, పాజిటివ్ టాక్ సొంతం చేసుకోలేకపోతున్నాయి. గతేడాది విడుదలైన ‘కృష్ణ వ్రిందా విహారి’ కూడా నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో నాగశౌర్య.. మరోసారి ‘ఊహలు గుసగుసలాడే’ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌తో జత కట్టాడు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్ చూస్తుంటే.. యూత్‌ను ఆకట్టుకొనే విధంగానే ఉంది. అయితే, ఇది కూడా ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగే లవ్ డ్రామానా లేదా? ఇద్దరు అపరిచితుల మధ్య ఏర్పడే బాండ్.. స్నేహం.. ప్రేమ.. విరహంగా రూపాంతరం చెందుతూ, చివరికి హీరోయిన్ మరొకరి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. ఆమెపై ప్రేమతో హీరో ఆ పెళ్లిలోనే తన ప్రేమను వ్యక్తం చేయడం వంటి రొటిన్ ఫార్ములాతో సాగుతుందా అనేది తెరపైనే చూడాలి. అయితే, శ్రీనివాస్ అవసరాల కథలో కాస్త కొత్తదనం ఉంటుంది. ఆ నమ్మకమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉందనిపిస్తోంది. ఏది ఏమైనా నాగశౌర్య ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడని ఆశిద్దాం. 


ఈ సినిమా ప్రారంభంలో చాలా అవాంతరాలు వచ్చాయి. కరోనా వల్ల షూటింగ్ కూడా జరగలేదు. దర్శకనిర్మాతల నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో ఈ మూవీ పూర్తిగా ఆగిపోయిందని భావించారు. తాజాగా మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయడంతో నాగశౌర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం విడుదలైన టీజర్ కూడా యూత్‌ను ఆకట్టుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో చాలా భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానందా’ వంటి హిట్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగాయి. ఈ మూవీకి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. 


Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!