కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంటే చరిత్ర. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. వందల చిత్రాల్లో నటించారు. నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. ఆయన బాటలో నడుస్తూ... కుమారుడు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ మంచు సినిమాల్లోకి వచ్చారు. కుమారులు ఇద్దరితో మోహన్ బాబు నటించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... కుమార్తె లక్ష్మీ మంచుతో నటించనున్నారు.


'పద్మశ్రీ' పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు,  ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న మొట్టమొదటిసారి కలిసి సినిమా చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. మళయాళ నటుడు సిద్దిక్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ తెరకెక్కించబోతున్నారు.


తండ్రితో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా లక్ష్మీ మంచు సోషల్ మీడియా పేర్కొన్నారు. తాను కలలు కన్న రోజు ఇదని చెప్పారు. "నా ఫస్ట్ హీరో, మా నాన్నతో నటిస్తున్నాను. నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నటిగా ఓ అవార్డు అందుకున్నట్టు ఉంది. నా ఆనందానికి అవధులు లేవు" అని లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ మాట్లాడుతూ "ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. మోహన్ బాబు, లక్ష్మీ మంచు మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారు. మార్చిలో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం'' అని చెప్పారు. 'డైమండ్' రత్నబాబు కథ, మాటలు  అందిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.