మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ను తీసుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు బాబీ సింహాను కూడా ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. 


ఇక మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు అఫీషియల్ గా వెల్లడించలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. 'వాల్తేర్ వీరయ్య'గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు చెప్పారు.


 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు. 'ఆచార్య' టైటిల్ ను కూడా ఇలానే ఓ ఈవెంట్ లో లీక్ చేశానని చిరు చెప్పడం విశేషం. తనతో సినిమాకి సంబంధించిన అప్డేట్స్ లీక్ చేస్తే రీచ్ బావుంటుందని ఇలా చేస్తుంటారని రీసెంట్ గా 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఫన్నీగా చెప్పారు చిరు. ఏదైతేనేం ఇప్పుడు మరోసారి తన కొత్త సినిమా టైటిల్ ను లీక్ చేశారు.


దర్శకుడు బాబీ.. చిరుకి పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో మంచి మసాలా కథను రాసుకున్నారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ లా ఉంటుందని మొదటినుంచి చెబుతూ వస్తున్నారు బాబీ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.