మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో  మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని మూవీ సెట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చిరంజీవితోపాటు రవితేజ, రాజేంద్రప్రసాద్, ఉర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. 


రవితేజ గురించి చెప్పడం మర్చిపోయా!


ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక సిబ్బంది చాలా శ్రమించారని తెలిపారు. ఈ మూవీలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్నారు. బాబీ తన ప్రాణం పెట్టి తీసిన మూవీ అని కొనియాడారు. అనంతరం ఈ మూవీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానాలు చెప్పారు. అయితే, ప్రెస్ మీట్ లో రవితేజ గురించి చెప్పకపోవడం పట్ల చిరంజీవి ఫీలయ్యారు. అనంతరం, ట్విట్టర్ వేదికగా సినిమా కోసం రవితేజ పడిన కష్టాన్ని వివరించారు.


తను చేయకపోతే మూవీ అసంపూర్ణంగా ఉండేది!


“’వాల్తేరు వీరయ్య’ టీం అందరితో, మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా, టీమ్ అందరూ ఎంతో సంతోషంగా, ఈ జర్నీలో వాళ్ల వాళ్ల మెమరీస్ పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత సంతృప్తిగా జరిగింది. అయితే, నా వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడుదామని అనుకోవడంలో, చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు ఈ విషయమై ఎంతో వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నాను. ప్రాజెక్టు గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చెయ్యాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నేంచి, కలిసి షూట్ చేసిన ప్రతి రోజూ రవితో మళ్లీ ఇన్నేళ్లలకి చేయటం నాకెంతో ఆనందం అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయి ఉంటే ‘వాల్తేరు వీరయ్య’ అసంపూర్ణంగా వుండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలు త్వరలో మాట్లాకుందాం” అని చిరంజీవి వివరించారు.






అటు ‘వీరసింహారెడ్డి’,  ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలను సంక్రాంతికే విడుదల చేయడం, ఈ రెండు సినిమాలకు నిర్మాతలు కూడా ఒకరే కావడంపై విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘‘సినిమాకు నిర్మాతలు  చాలా ప్రధానం. వారి సినిమాలో నటించిన తర్వాత మా పని పూర్తవుతుంది. ఆ తర్వాత మేం ఎందులోనూ జోక్యం చేసుకోం” అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.  అటు పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడనే ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. ‘‘ఏ హీరోతోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్దమే. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. ముందు అవి పూర్తికావాలి. సుమారు రెండేళ్లు పడుతుందేమో’’ అని చెప్పారు. ‘‘మనం దేనికైనా కమిట్ అయినప్పుడు.. దానికి న్యాయం చేయాలి. ఆ అవసరం లేదు అనిపించిన రోజున రిటైర్డ్ అయిపోవడమే ఉత్తమం”అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.


ప్రీ రిలీజ్ పంక్షన్ లోనే మాట్లాడుతా!


రవితేజ ఈప్రెస్ మీట్ లో ఏం మాట్లాడలేదు. ఇక్కడ రెండు ముక్కలు కూడా మాట్లాడను. అన్ని ముక్కలూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే మాట్లాడుతానని చెప్పారు.


Read Also: టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముగ్గురు భామలు, 2023 అంతా వీళ్లదేనా?