యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇన్నాళ్లు పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. ప్రభాస్ తర్వాతే అని శర్వానంద్ చెప్పేవాడు. చివరకు పెద్దల సమక్షంలో పెళ్లికి ఒప్పుకున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థ వేడుక సింపుల్ గా జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. రాంచరణ్, ఉపాసన దంపతులు ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నూతన వధూవరులను నెటిజన్లు అభినందిస్తున్నారు. జంట చూడ చక్కగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.






వధువు రక్షితరెడ్డి ఎవరంటే?


శర్వానంద్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కట్టుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. రక్షితరెడ్డితో ఆయన ఎంగేజ్ మెంట్ జరిగింది. రక్షిత రెడ్డి ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. రక్షితరెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలిసింది. అంతేకాదు, ఆమె ఏపీ మాజీ మంత్రి  బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం.  అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రక్షిత, కరోనా విజృంభణ తర్వాత ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. ఇంతకీ శర్వానంద్ ఆ అమ్మాయిని ఎక్కడ కలిశాడు? వీరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?  అనే విషయం మాత్రం బయటకు తెలియదు. అటు శర్వానంద్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో జోరుగా ప్రచారం జరిగాయి. కానీ,  శర్వానంద్ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇరు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆయన ఎంగేజ్ మెంట్ ఫోటోలు బయటకు వచ్చాయి.


రెండు సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్


శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే, ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మెప్పించాడు. ఆ తర్వాత మంచి కథలు సెలక్ట్ చేసుకుని హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మంచి కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా కంటే ముందు వరుసగా 5 ఫ్లాపులను ఎదుర్కొన్నాడు.  ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. మరికొన్ని సినిమా కథలు వింటున్నట్లు తెలుస్తోంది. 






Read Also: ‘సైంధవ్‘ నుంచి అదిరిపోయే అప్డేట్, వెంకీ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కీరోల్