కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ధనుష్. దీనికి 'సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు' అంటూ సాగే ఈ పాటను శ్వేతామోహన్ పాడింది. ఇదొక మెలోడీ సాంగ్. శ్రోతలకు ఈ సాంగ్ బాగానే కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ధనుష్ 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అతడి లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. 





ఈ ఏడాది ధనుష్ ఐదో సినిమా!

ధనుష్ హీరోగా నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిది 'మారన్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాగా... 'తిరు', 'నేనే వస్తున్నా' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'లో కూడా ధనుష్ కనిపించారు. ధనుష్‌కు 'సార్' ఈ ఏడాది ఐదో రిలీజ్ అవుతుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్ (Samyuktha Menon). 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు (Venky Atluri). వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను', నితిన్ 'రంగ్ దే' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

విద్యా వ్యవస్థ నేపథ్యంలో 'సార్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆల్రెడీ 'యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్' స్లోగన్‌తో విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇందులో ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్నారని తెలిసింది.

'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌.