Manisha Koirala : మనీషా కోయిరాలా.. బాలీవుడ్‌‌లో ఎన్నో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేసి, అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మనీష.. ఇప్పుడు ఓ వెబ్ సీరిస్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.


మ‌నీషా కోయిరాలా ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నార‌ట‌. దానికి సంబంధించి మూడు ఫొటోల‌ను షేర్ కూడా చేశారు ఆమె. “ఈ రోజుల్లో నేనేం చేస్తున్నాను అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. కొంతమంది నిజాయ‌తీగా అడుగుతారు. కానీ కొంత‌మంది మాత్రం మీరు 53 ఏళ్ళ వయసులో పెద్ద‌గా ఏం చేయ‌లేరులే అన్న‌ట్లుగా అడుతుగారు. నిజ‌మే మ‌రి.. కొన్నిసార్లు ఏమీ చేయ‌కుండా.. ఇష్ట‌ప‌డే వాటిని ఆస్వాదిస్తాను. నా పిల్లులు, కుక్కలతో లేదా పుస్తకం, సంగీతంతో విశ్రాంతి తీసుకోవడం, ఆధ్యాత్మిక అంశాలను పరిశీలించడం, పాడటం, డ్యాన్స్ చేయ‌డం, నేర్చుకోవడం, ప్రకృతిలో నడక, జిమ్‌కు వెళ్లడం వంటివి చేస్తాను” అని తెలిపారు.


30 ఏళ్లు 100 సినిమాలు.. 


“30 ఏళ్లు.. 100 సినిమాల త‌ర్వాత ఇప్పుడు నేను నా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాను. ప‌ని ప్ర‌క్రియ‌ను ప్రేమిస్తేనే ప‌నిని ప్రేమిస్తాను. భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్ల మంచి వ్య‌క్తులు నా చుట్టూ ఉన్నారు. నేను వారి ప్రేమ‌, సంర‌క్ష‌ణ‌లో మునిగిపోయాను. నేను దాదాపు ఒంట‌రిగానే బ‌తికాను. ఇంకా అనిశ్చితితోనే ఉన్నాను. ఒక సెల‌బ్రిటీగా ఉండ‌టం మ‌రిచిపోకూడ‌దు. చాలా ఇబ్బందులు, మంచి, చెడు వ్య‌క్తుల‌ను ఎదుర్కోవాలి. మీడియా, ఫేక్ న్యూస్ అన్ని భరించాలి. ఇప్ప‌టికీ వెన‌క్కి తిరిగి చూసుకుంటే.. ఇవ్వ‌న్నీ నేనేనా చేసింది? అనిపిస్తుంది. బ‌హుశా చిన్న‌దాన్ని కాబ‌ట్టి అన్నీంటిని అధిగ‌మించాలి అనే జీల్ తో ఇవ్వ‌న్నీ చేశానేమో అనిపిస్తుంది. మ‌నం ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు దేవుడు దేవ క‌న్య‌ల‌ను పంపిస్తాడు అంటారు. అలా నాకు నిజ‌మైన స్నేహితులు దొరికారు. నా మ‌న‌సులో బాధ‌, ఆనందం, మంచి, చెడు అనే జ్ఞాప‌కాల నిధి ఉంది” అంటూ ఒక సుదీర్ఘ‌మైన పోస్ట్ రాశారు మ‌నీషా కోయిరాలా. 






మ‌నీషా కోయిరాలా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది ఆమె. ఇక ఇప్పుడు ఆమె సంజయ్ లీలా బన్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నారు. ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’తో ఓటీటీలోకి రిలీజ్ కానుంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో మనీషా కోయిరాలాతో పాటు సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్లు అంతా వేశ్య‌లుగా నటిస్తున్నారు. వాళ్ల జీవితాల‌ను చూపిస్తూ టీజ‌ర్ సాగింది. స్వాతంత్య్రం రాక‌ముందు పాకిస్థాన్ లోని వేశ్య‌ల జీవితాలు ఎలా ఉంటాయో ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.


Also Read: కృష్ణ చేతిలో గ‌న్ ఫైర్ అయ్యింది, ఎంత ప్ర‌మాదం జ‌రిగిందంటే? - షాకింగ్ విషయాలు చెప్పిన సూపర్ స్టార్ సోదరుడు