ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపేసిన సంగీత దర్శకుడు మణిశర్మ. టాలీవుడ్ టాప్ హీరోలు అందరికీ ఆయనే సంగీతం అందించే వారు. మణిశర్మ మ్యూజిక్ అంటే ఆల్బమ్ అదిరిపోవాల్సిందే అనే టాక్ నడిచేంది. ఆయన మీద హీరోలకు ఎంతో నమ్మకం ఉండేది. కనీసం  ట్యూన్లు కూడా వినేవారు కాదు. అలాంటి మణిశర్మ రాను రాను పోటీలో వెనుకబడి పోయారు. ఇప్పటి వరకు సుమారు 200 సినిమాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన కొడుకు మహతి స్వర సాగర్ కూడా సంగీత దర్శకుడిగా బిజీ అయ్యారు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలను కూడా హ్యాండిల్ చేస్తున్నారు.


మణిశర్మ సంగీతంపై విమర్శలు


అయితే, కొద్ది రోజులుగా తండ్రి, కొడుకులు ఆయా సినిమాకు అందిస్తున్న సంగీతం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మణిశర్మ సంగీతం అందించిన ‘అమీతుమీ‘, ‘ఫ్యాష‌న్ డిజైన‌ర్‘, ‘శ‌మంత‌క‌మ‌ణి‘, ‘లై‘, ‘దేవదాస్‘ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పుకోవచ్చు. 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‘ సినిమాతో ఫుల్ ఫామ్‌ లోకి వచ్చారు. అయితే, వెంకటేష్‌ ‘నారప్ప‘, చిరంజీవి ‘ఆచార్య‘ సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాయి. ‘శాకుంతలం‘ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక తాజాగా విడుదలైన 'బెదురులంక 2012'  సంగీతం కూడా ప్రేక్షకులను అకట్టుకోలేదనే టాక్ నడుస్తొంది. ‘బెదురులంక 2012‘ బ్యాగ్రౌండ్ స్కోర్‌ అస్సలు బాగాలేదంటున్నారు నెటిజన్లు. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న థియేటర్లలో కూడా మణిశర్మ సంగీతం ఆకట్టుకోలేకపోయిందనే టాక్ నడుస్తోంది.


ఆకట్టుకోని మహతి సాగర్ మ్యూజిక్


అటు మణిశర్మ కొడుకు మహతి సాగర్  రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘బోళా శంకర్‘ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం కూడా మ్యూజిక్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేదనే టాక్ వినిపించింది. మహతి సాగర్ ‘భోళా శంకర్‘ చిత్రానికి ముందు ‘భీష్మ‘  ‘ఛలో‘, ‘మాచెర్ల నియోజకవర్గం‘ చిత్రాలకు సంగీతం అందించారు. మొత్తంగా ‘బోళా శంకర్‘ చిత్రంతో కొడుకు విమర్శలను ఎదుర్కోగా, 'బెదురులంక 2012'తో తండ్రి ట్రోలింగ్ కు గురవుతున్నారు. టాలీవుడ్ మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న మణిశర్మ సంగీతం ఎందుకు చప్పగా మారుతోంది? అని నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తర్వాత అంచనాలు పెరిగినప్పటికీ, మణిశర్మ 'ఆచార్య', ‘బెదురులంక 2012’తో మళ్లీ ఫామ్ కోల్పోయాడంటున్నారు.


'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' భామ నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' శుక్రవారం(ఆగష్టు25న) విడుదలైంది. డిసెంబర్ 31, 2012లో యుగాంతం వస్తుందని అందమైన గోదావరి తీరంలోని ఓ పల్లెలో ప్రజలు ఏం చేశాడనేది 'బెదురులంక 2012' కథ. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు.  అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన పాత్రల్లో నటించారు.


Read Also: తెలుగులో సినిమాలు చేస్తున్నా, దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో తెలియదట - అడ్డంగా బుక్కైన కియారా అద్వాని


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial