కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ లోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపిస్తున్నారని న్యాయవాది సెల్వం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో విక్రమ్.. ఆదిత్య కరికాలన్ అనే పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో ఆదిత్య కరికాలన్ నుదిటిపై తిలకం లేదని అంటున్నారు సెల్వం. కానీ విక్రమ్ కి సంబంధించిన పోస్టర్ లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారు.


ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి చూపించారనేది సెల్వం అభిప్రాయం. అందుకే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకముందే తనకు షో వేసి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ నోటీసులపై మణిరత్నం, విక్రమ్ స్పందించలేదు. ఇక ఈ సినిమాను కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 


Also Read :పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?