Manchu Vishnu | మంచు విష్ణు మంచి ఊపు మీద ఉన్నారు. మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా పరాజయం నేపథ్యంలో విష్ణు నుంచి మీరు వెంటనే ఈ అప్‌డేట్ ఊహించి ఉండరు. అయితే, ఆ చిత్రం విడుదలైన తర్వాతి రోజే విష్ణు ఓ గుడ్ న్యూస్‌తో తన అభిమానుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సర్‌ప్రైజ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. 


విష్ణు ‘మోసగాళ్లు’ సినిమా తర్వాత మరే చిత్రంలోని నటించలేదు. ఆ తర్వాత ‘మా’ అధ్యక్షుడి ఎన్నికల్లో బిజీగా మారారు. మోహన్ బాబుతో ‘సన్న ఆఫ్ ఇండియా’ సినిమా నిర్మించారు. శుక్రవారం విడుదలైన రోజే సినిమా కలెక్షన్స్ షాకిచ్చాయి. అయితే, ఈ నష్టం కంటే సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్ మంచు ఫ్యామిలీని ఎక్కువ బాధించాయి. ఈ ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ, నెటిజనులు ఆ నోటీసులను కూడా ట్రోల్ చేస్తూ విష్ణు సహనాన్ని పరీక్షిస్తున్నారట. 


Also Read: ‘బెస్ట్‌సెల్లర్’ రివ్యూ: శృతిహాసన్‌లో మస్త్ షేడ్స్ ఉన్నాయ్! కానీ, పుస్తకమే..


ఇక విషయాన్ని పక్కన పెడితే.. మంచు విష్ణు హీరోగా త్వరలోనే సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో తన తర్వాతి సినిమా గురించి ప్రకటిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. మోహన్ బాబు, విష్ణు.. కొత్త చిత్ర దర్శకుడితోపాటు సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ తదితరులతో భేటీ అయ్యారు. ఈ చర్చలు ముగియగానే ఆ సినిమా విశేషాలను వెల్లడిస్తామని విష్ణు ఇన్‌స్టాలో పేర్కొన్నారు. అయితే, కొందరు మాత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అని ట్రోల్ చేస్తున్నారు. మరి, ఆ కామెంట్లు విష్ణు చూశాడో లేదో.