'మోసగాళ్లు' సినిమా తరువాత మంచు విష్ణు నుంచి మరో సినిమా రాలేదు. నిజానికి 'మా' ఎలెక్షన్స్ తో బిజీగా గడిపారు విష్ణు. ఆ తరువాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అదే సమయంలో మంచు ఫ్యామిలీపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. తమ ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేయడంతో మంచు ఫ్యామిలీ సీరియస్ అయింది. ఈ క్రమంలో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. 


ఇదిలా ఉండగా.. రీసెంట్ గా మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో తన తర్వాతి సినిమా గురించి ప్రకటిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ లాంటి వాళ్లు కనిపించారు. తాజాగా తన సినిమా గురించి అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో మంచు విష్ణు 'గాలి నాగేశ్వరావు'గా కనిపించబోతున్నారు. బహుసా సినిమా టైటిల్ కూడా అదే అయి ఉండొచ్చు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 


ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ పని చేయనున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లేతో అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.