తెలుగులో మలయాళ సినిమా రీమేక్స్ మంచి విజయాలు సాధిస్తున్నాయి. 'భీమ్లా నాయక్', 'గాడ్ ఫాదర్' సినిమాలే అందుకు తాజా ఉదాహరణలు. మలయాళ సినిమాను యథాతథంగా రీమేక్ చేయకుండా... తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసిన ఇటువంటి సినిమాలకు ఆదరణ బావుంటోంది. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) కథానాయకుడిగా తనయుడు విష్ణు మంచు (Vishnu Manchu)  ఓ సినిమా నిర్మించనున్నారు. అది మలయాళ సినిమాకు రీమేక్. మరిన్ని వివరాల్లోకి వెళితే... 


Vishnu Manchu On Android Kunjappan Remake : మలయాళంలో మూడేళ్ళ క్రితం 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' వచ్చింది. ఆ సినిమా రీమేక్ హక్కులను విష్ణు మంచు తీసుకున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 


విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జిన్నా' (Ginna Movie). తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా విడుదల అవుతోంది. సినిమా ప్రచార కార్యక్రమాల కోసం విష్ణు మంచు కొచ్చి వెళ్లారు. అప్పుడు 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' రీమేక్ గురించి మలయాళ మీడియా ప్రశ్నించగా... ఆయన కన్ఫర్మ్ చేశారు. 


నేను నటించడం లేదు...
ప్రొడ్యూస్ చేస్తున్నాను! - విష్ణు మంచు 
''తెలుగు నేటివిటీకి, నాన్నగారి ఇమేజ్‌కు తగ్గట్లు 'ఆండ్రాయిడ్ కుంజప్పన్'లో కొన్ని మార్పులు చేస్తున్నాం. కథలో ఆత్మ... తండ్రీ కుమారుల మధ్య బంధం... చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. ఆ ఆత్మను మాత్రం మేం మార్చడం లేదు. ఆ సినిమాను నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. కానీ, నటించడం లేదు. నాన్నగారితో నటించాలంటే నాకు భయం. కుమారుడి పాత్రలో వేరొకరు నటిస్తారు'' అని విష్ణు మంచు తెలిపారు. జనవరిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Also Read : ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలు ఉన్నాయి కానీ సేతు ఒక్కటే - నమ్మకాన్ని సవాల్ చేసే 'రామ్ సేతు'



'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో ఈ ఏడాది మోహన్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన నటన అద్భుతంగా ఉన్నప్పటికీ... ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమాలో మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్ర పోషించారు. తెలుగు భాష, డైలాగులు చెప్పడంలో ఆయనకు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని, ఏరి కోరి మరీ ఆయనతో గుణశేఖర్ ఆ పాత్ర చేయించారట. 



దీపావళికి థియేటర్లలో 'జిన్నా'!
'ఆండ్రాయిడ్ కుంజప్పన్' రీమేక్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్న విష్ణు మంచు... ఈ దీపావళికి జిన్నా' సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. అక్టోబర్ 21న ఆ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా... సునీల్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, 'చమ్మక్' చంద్ర, సద్దాం తదితరులు ఇతర పాత్రల్లో నటించిన చిత్రమిది. 'చంద్రముఖి' తరహాలో ఇది హారర్ కామెడీ చిత్రమని విష్ణు మంచు చెబుతున్నారు.     


Also Read : 'రెడ్డి గారు'కు ఓటు వేసిన బాలకృష్ణ?