సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తుంటారు. ఒకప్పుడు సినిమాలో హీరో, హీరోయిన్ల స్టిల్స్ పెట్టేసి, లిరిక్స్ యాడ్ చేసి పాటలను రిలీజ్ చేసేవారు. పెద్దగా ఖర్చుపెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. లిరికల్ వీడియోలతోనే తమ మార్క్ చూపించాలనుకుంటున్నారు. దీనికోసం ఎక్కడా రాజీ పడడం లేదు. ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటున్నారు. 

 

'అల వైకుంఠపురంలో' సినిమా నుంచి ఈ లిరికల్ వీడియోలకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. మ్యుజీషియ‌న్స్ ను, సింగ‌ర్స్‌ ను తీసుకొచ్చి లిరికల్ వీడియోలను స్పెషల్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 'కళావతి' అంటూ సాగే ఈ పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ తో పాటు, తమన్.. కొందరు మ్యుజీషియ‌న్స్ తీసుకొని పాటను చిత్రీకరించారు. 

 

వీరంతా ఒక రెండు నిమిషాల పాటు ఈ సాంగ్ లో కనిపించి ఉంటారు. అయితే ఈ ఒక్క పాట కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..? అక్షరాల రూ.60 లక్షలు. 'సర్కారు వారి పాట' నుంచి విడుదలైన మొదటి పాట ఇది. ప్రమోషన్స్ పరంగా ఈ సాంగ్ మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని భావించారు. అందుకే అంత ఖర్చు చేయడానికి వెనుకాడలేదు. కాకపోతే ఈ పాట ముందే లీకవ్వడంతో.. వారి కష్టమంతా వృధా అయింది. అందుకే చెప్పిన టైం కంటే ముందే పాటను రిలీజ్ చేశారు. 

 

మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.