ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. హీరోలే కాదు... హీరోయిన్లు కూడా పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం పాన్ ఇండియా సినిమాను మొదలుపెట్టారు. 'క్రాక్'లో నెగెటివ్ రోల్... 'నాంది'లో న్యాయవాది... తమిళ్ మూవీ 'సర్కార్'లో ఓ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కుమార్తెగా ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్... ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మీ శరత్ కుమార్ స్టైల్. 

 

ఒక భాషకు, ఇమేజ్‌కు పరిమితం కాలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. సరికొత్త పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు ఆమె రానున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న సినిమా 'శబరి'. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా తాజాగా కొడైకెనాల్‌లో రెండు వారాల పాటు కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. 

 

కొడైకెనాల్, విశాఖ, హైదరాబాద్... చాలా లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నామని... సినిమా బాగా వస్తోందని,. 'శబరి'లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉందని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు. చిన్నపాప నువేక్షా తన కుమార్తె పాత్రలో నటించిందని.. ఆ చిన్నారితో బాగా క్లోజ్ అయినట్లు.. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, మీ ముందుకు సినిమా ఎప్పుడు తీసుకు వద్దామా? అని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

 

''కొడైకెనాల్ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఒక పాట, క్లైమాక్స్ షూట్ చేశాం. ఫైట్ మాస్టర్స్ నందు - నూర్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్స్ తీశాం. పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో విశాఖ షెడ్యూల్ ప్రారంభిస్తాం. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి కొత్త పాత్ర 'శబరి'లో చేస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్'' అంటూ నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు. 

 

''కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లి పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ లేడీగా కనిపిస్తారు. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, కూతురి క్షేమం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి, కంటికి కనిపించని చీకటి మృగంతో ఒంటరి సైన్యంలాఎం పోరాడే జననిగా, మునుపెన్నడూ చేయనటువంటి  భావోద్వేగాలున్న పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా పోషించారు. క్రైమ్ నేపథ్యంలో ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది'' అంటూ దర్శకుడు అనిల్ కాట్జ్ చెప్పుకొచ్చారు.