సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను రీషూట్ చేస్తున్నారంటే.. దాని గురించి నెగెటివ్ గా మాట్లాడుకుంటారంతా. తీసిన సీన్లనే మళ్లీ మళ్లీ తీస్తున్నారంటే.. అదొక తప్పులా భావిస్తుంటారు. సినిమా ఇక పోయినట్లే అని చర్చించుకుంటూ ఉంటారు. మీడియాలో కూడా ఇలానే వార్తలు వస్తుంటాయి. అయితే ఇదే చర్చ 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా విషయంలో జరిగితే మీడియా వాళ్లు దాని గురించి నాగార్జునను ప్రశ్నించారు. దానికి నాగార్జున.. కరెక్షన్స్ ఉంటే దాన్ని సరి చేయడంలో తప్పేముందని ప్రశ్నించారాయన. 


'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా విషయంలో రీషూట్లు జరిగిన మాట నిజమేనని ఒప్పుకున్నారు నాగార్జున. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ.. తన 'ఆచార్య' సినిమాకి రీషూట్లు జరిగినట్లుగా వస్తోన్న వార్తలపై నాగార్జునలానే రియాక్ట్ అయ్యారు. 'ఆచార్య' సినిమా అనుకున్నదాని కంటే బాగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. దానికి కరోనాతో పాటు రీషూట్లు కూడా కారణమని వార్తలొచ్చాయి. 


ఈ విషయంపై కొరటాల శివను ప్రశ్నించగా.. 'మా సినిమాకు రీషూట్ అవసరం రాలేదు. కానీ రీఈషూట్ అనేది తప్పులా, ఓ కంప్లైంట్ లాగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇది నాకు ఎప్పటికీ అర్ధం కాదు. ఓ సన్నివేశాన్ని ఇంత కంటే బాగా తీయొచ్చనే అభిప్రాయం దర్శకుడితో కలిగితే రీషూట్ కు వెళ్లొచ్చు. అది మంచి విషయమే కదా..' అని అన్నారు. 


సన్నివేశం బాగా లేకపోయినా.. చాలు అని సర్దుకుపోవడం తప్పు అవుతుందని అన్నారు. ప్రేక్షకుడికి ఇంకా మంచి ఫీలింగ్ తెప్పించడం కోసం రీషూట్ చేస్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. తన వరకు రీషూట్ చేయాల్సిన అవసరమొస్తే ఎంతమాత్రం సంకోచించకుండా నిర్మాతను ఒప్పించి రీషూట్ కి వెళ్తానని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.   


Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత


Also Read: అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వేదాంత్ మాధవన్, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న నటుడు మాధవన్