‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ కు క్రేజ్ పెరిగిపోయింది. ఈ మూవీలో చరణ్ నటనకు అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురింపించింది. చరణ్ తో కలసి మళ్లీ పనిచేయాలని ఉందని పేర్కొంది. ప్రస్తుతం కియార వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఏటా ఓ తెలుగు సినిమా చేయాలని ఉంది: కియార


ఇటీవల కియార ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. ఈ సందర్భంగా శంకర్ దర్శకత్వంలో తాను నటిస్తోన్న ‘ఆర్ సి 15’ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాలలో నటించడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అయితే మంచి కథలను ఎంపిక చేసుకోవాలని తెలిపింది. తన వద్దకు ఎన్నో కథలు వచ్చాయని, చాలా కథలు విన్నాకే ‘ఆర్ సి 15’ కు ఒప్పుకున్నానని చెప్పింది. ఎప్పటినుంచో దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉండేదని ఆ కల ఇప్పుడు నెరవేరిందని పేర్కొంది. ఆయన మంచి దర్శకుడు అని పేర్కొంది. వీలైతే ప్రతీ ఏటా ఓ తెలుగు సినిమాలో చేయాలని ఉందని చెప్పింది కియార.


రామ్ చరణ్ ఏమ్ మారలేదు..


శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆర్ సి 15’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది కియార. గతంలో వీరిద్దరూ కలసి ‘వినయ విధేయరామ’ సినిమాలో నటించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా రామ్ చరణ్, కియార జంటకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో చరణ్, కియార మంచి స్నేహితులు అయ్యారు. ఈ విషయాన్ని కియార చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. ఇప్పుడు మళ్లీ చరణ్ తో కలసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పింది కియార. చరణ్ మంచి నటుడని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నా తన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. అంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని పేర్కొంది. ఆ గొప్ప వ్యక్తిత్వమే రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ ను చేసిందని చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కూడా కియారకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కియార పెళ్లికి ఉపాసన హాజరుకాకపోవడంతో ఆమెకు క్షమాపణలు కూడా తెలిపింది. అప్పట్లో ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అయింది కూడా. 


ప్రస్తుతం ‘ఆర్ సి 15’ షూటింగ్ జరుగుతోంది. ఆస్కార్ అవార్డుల వేడుక తర్వాత రామ్ చరణ్ ఈ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ మూవీలో తొలిసారిగా చరణ్ శంకర్ తో కలసి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.