బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె మొఖం పై బలమైన గాయాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఏం జరిగింది అంటూ ఆరా తీస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


దివ్య ఖోస్లా ప్రస్తుతం ‘యారియాన్ 2’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ యూకే లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దివ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘‘నా రాబోయే చిత్రం ‘యారియాన్ 2’ కోసం ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నపుడు నేను తీవ్రంగా గాయపడ్డాను. అయినా షూటింగ్ కొనసాగించక తప్పలేదు. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ గాయంతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో దివ్య ముఖంపైన తీవ్రంగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కాగా, కొన్ని రోజుల క్రితమే దివ్య ఖోస్లా కుమార్ ‘యారియాన్ 2’ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ ను అందించింది. ఈ మేరకు ఆమె గతంలో తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుందని, తాను చివరి పోస్ట్ చేసినపుడు చాలా మంది ఎక్కడ ఉన్నానో అడిగారని చెప్పింది. ఆమె తనకు ఎంతో ఇష్టమైన సినిమా కోసం ఇంగ్లాండ్ లో ఉన్నానని, సినిమా కోసం వర్క్ చేస్తున్నానని చెప్పింది. దీనికి అభిమానుల ప్రేమ, ఆశీస్సులు కావాలి అని పేర్కొంది. దివ్య దాదాపు ఏడేళ్ల తర్వాత ‘యారియాన్ 2’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది. అలాగే 'యారయాన్ 2' సినిమాలో మీజాన్ జాఫ్రీ, వరినా హుస్సేన్, అనశ్వర రాజన్, పెరల్ వి పూరి నటిస్తున్నారు. నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాతో బాలీవుడ్‌ లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, దివ్య కుమార్ ఖోస్లా అలాగే ఆయుష్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇక దివ్య ఖోస్లా 2004 లో ఉదయ్ కిరణ్ నటించిన ‘లవ్ టుడే’ సినిమాలో హీరోయిన్ గా చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కు పాగా మార్చింది. అక్కడ పలు సినిమాల్లో నటించిన తర్వాత 2014 లో వచ్చిన ‘యారియాన్’ సినిమాతో దర్శకురాలిగా మారింది.