ఎక్కడైనా డెలీవరీ బాయ్ మనకి ఫుడ్ తీసుకువస్తాడు కదా. అలాంటిది డెలీవరి బాయ్ కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ డెలీవరీ బాయ్‌గా మారడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా?. ఇంతకీ ఇదంతా... ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు జరిగింది అనే కదా మీ సందేహం. బిగ్ బీతో ఫుడ్ తెప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరు అని కూడా మీ సందేహం కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం... ఆ రీజన్స్ ఏంటో చక చకా చదివేయండి. 


ప్రముఖ సోనీ టీవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కౌన్‌ బనేగా కరోడ్‌‌పతి-  13వ సీజన్ ఆసక్తిగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలోనే ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆకాశ్ వాగ్‌మరే అనే వ్యక్తి ఈ షోలో పాల్గొన్నాడు. అతడు డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అక్కడితో ఆగకుండా తన కలని నిజం చేసుకునేందుకు ఆకాశ్ రాత్రిళ్లు చదువుకుంటుంటాడు. కార్యక్రమంలో ఆకాశ్ గురించి బిగ్ బీ మాట్లాడుతూ... మన కలని నిజం చేసుకునేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన కల ముందు ఎలాంటి సవాలైని చిన్నదిగా కనిపిస్తోంది... ఇందుకు ఆకాశే ఉదాహరణ అని చెప్తాడు. తర్వాత ఆకాశ్‌కి సంబంధించిన వీడియో ప్లే అవుతుంది.






అనంతరం బిగ్ బీ ఇష్టమైన ఫుడ్‌ని ఆర్డర్ చేసిన వారికి అందిస్తాడు ఆకాశ్. ఇప్పుడు తన కోసం ఒకరు ఫుడ్ తీసుకువస్తారు. ఈ రోజు నేను ఆకాశ్ కోసం డిన్నర్ డెలీవరి చేస్తున్నాను అని ఫుడ్ ప్యాకెట్ ఒకటి ఆకాశ్‌కి అందజేస్తారు అమితాబ్. అది తీసుకున్న ఆకాశ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బుఅవుతాడు. ఇదంతా అక్కడ నుంచే చూస్తోన్న ఆకాశ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియోను సోని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.   


ఈ సీజన్లో సామాన్యులతో పాటు ఎందరో సెలబ్రెటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. మొన్న మాజీ క్రికెటర్లు గంగూలీ, సెహ్వాగ్ పాల్గొన్నారు. సెహ్వాగ్ పాటలు పాడుతూ... రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ శ్రేజేష్ వచ్చే వారాంతంలో సందడి చేయనున్నారు.