Karthika Deepam To End:   కార్తీకదీపం సీరియల్ కు త్వరలో శుభం కార్డ్ పడనుంది.. డాక్టర్ బాబు-వంటలక్క-మోనిత మధ్య  సాగిన  కథ మొత్తం ఏంటో చూద్దాం...


సవతితల్లి దగ్గర నరకం చూస్తున్న దీపకు దేవుడంటే భక్తి, సమాజ సేవ అంటే ఇష్టం. ఓ సందర్బంలో డాక్టర్ కార్తీక్  దీపను చూసి ఇష్టపడతాడు. పెళ్లిచేసుకోవాలి అనుకుంటాడు. అయితే తనకు పిల్లలు పుట్టరని దీపకు చెప్పమని..ఆమె తండ్రికి చెబుతాడు. ఆయన మాత్రం తన కూతురి కష్టాలు తీరాలంటే డాక్టర్ బాబుకి ఇచ్చి పెళ్లిచేయడమే మంచిది..పిల్లలు పుట్టినా లేకున్నా పర్వాలేదని భావించి దీపకు ఆ విషయం చెప్పడు. ఆ ఒక్క నిజం దాచడమే సీరియల్ ఇన్నాళ్లూ నడిచింది...


పిల్లలు పుట్టరన్నది మోనిత కుట్రే
హిమ అనే మరో డాక్టర్ ను ప్రేమిస్తాడు..మోనిత అనే మరో డాక్టర్ హిమను చంపించేందుకు యాక్సిడెంట్ చేయిస్తుంది. ఆ యాక్సిడెంట్ లో హిమ చనిపోతుంది..కార్తీక్ గాయాలతో బయటపడతాడు. అసలు యాక్సిడెంట్ అయిన కార్లో కార్తీక్ ఉన్నాడని ఊహించని మోనిత మొదట కంగారుపడుతుంది..ఆ తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడని తెలియడంతో హమ్మయ్య అనుకుంటుంది. అంతలోనే మరో కుట్ర ఆలోచనకు తెరతీస్తుంది. కార్తీక్ ఎప్పటికీ తన సొంతం అవ్వాలంటే పిల్లలు పుట్టరనే అబద్ధం చెప్పిస్తే చాలని భావించి రిపోర్ట్స్ మార్పించి..డాక్టర్లతో అబద్ధం చెప్పి నమ్మిస్తుంది. కార్తీక్ అదే ఆలోచనలో ఉంటాడు.


మోనిత మాటలు నమ్మి దీపపై అనుమానం
విహారి అనే మరో కవిని అన్నయ్యగా భావించి దీప క్లోజ్ గా ఉంటుంది. ఈ అవకాశాన్ని వాడుకున్న మోనిత ఇద్దరి మధ్యా లేని బంధం క్రియేట్ చేసి కార్తీక్ కు అనుమానం కలిగేలా చేస్తుంది. ఇంతలో దీప ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో... 'నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిని నేను కాదు' అని కార్తీక్ స్టేట్మెంట్ ఇస్తాడు. తనకు పిల్లలు పుట్టరని క్లారిటీ ఇస్తూ మోనిత క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్నీ చూపిస్తాడు. దాంతో ఇంటిల్లపాదీ దీపను అనుమానిస్తారు. అది తట్టుకోలేక దీప ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి ఎన్నో కష్టాలు పడుతుంది. దీపపై అనుమానం ఇంట్లో అందరకీ పోయినా..కార్తీక్ మాత్రం మారడు. మధ్యలో మోనితను పెళ్లిచేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తే..సౌందర్య ఆపుతుంది.. 


Also Read: 'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్, క్లారిటీ ఇచ్చిన నిరుపమ్, ప్రేమీ - త్వరలో 'బ్రహ్మముడి'


కవలల్లో ఒకర్ని ఇంటికి తీసుకురావడంతో మలుపులు తిరిగిన కథ
దీపకు పుట్టిన కవల్లలో ఒకరైన హిమను ఇంటికి తీసుకొస్తుంది సౌందర్య. మొదట్లో అనుమానించి కార్తీక్..ఆ తర్వాత ఆ పాపన వదిలి ఉండలేని స్థితికి వచ్చేస్తాడు. మరోవైపు దీప దగ్గర పెరుగుతున్న శౌర్య తండ్రికోసం తపించిపోతుంది. కొన్ని రోజులకు శౌర్యకు తన తండ్రి కార్తీక్ అని తెలుస్తుంది. అష్టకష్టాలు పడిన తర్వాత తండ్రికి దగ్గరవుతుంది. మోనిత కుట్రలన్నీ బయటపడడంతో కార్తీక్ కు కూడా నిజం తెలుస్తుంది. ఇక అంతా కలసిపోయారు సంతోషంగా ఉన్నారన్న సమయంలో  మోనిత వచ్చి బాంబ్ పేల్చుతుంది.. తన కడుపులో ఉన్న బిడ్డకు కార్తీక్ తండ్రి అని చెబుతుంది... ఇది ఇంట్లో అందరికీ పెద్ద షాక్.. అక్కడి నుంచీ దీప-కార్తీక్ కు మళ్లీ కష్టాలు మొదలవుతాయి. 


మోనిత బిడ్డను కంటుంది..ఆ బిడ్డను ఎవరో ఎత్తుకుపోతారు.. ఎత్తుకుపోయిన ఆ బిడ్డ తిరిగి తిరిగి దీప-కార్తీక్ దగ్గరకు చేరుతాడు. ఆ  సంగతి తెలుసుకున్న మోనిత మరో కుట్రకు ప్లాన్ చేస్తుంది. నిజం తెలుసుకున్న సౌందర్య ఆ బిడ్డను మోనితకు అప్పగించి కుట్రకు ఫుల్ స్టాప్ పెడుతుంది.


Also Read: ముగ్గురి భామల మధ్య డాక్టర్ బాబు- చారుశీలను వణికించిన మోనిత, శపథం చేసిన దీప


కథలో మరో మలుపు చిక్ మంగుళూర్ టూర్
మోనిత గోల వదిలేసిందని ఇకపై సంతోషంగా ఉండొచ్చని చిక్ మంగళూరు టూర్ వెళతారు దీప-కార్తీక్. అక్కడ జరగిన ప్రమాదంలో దీప-కార్తీక్-హిమ-శౌర్య..తలో దిక్కు అయిపోతారు. హిమ ఎట్టకేలకు నానమ్మ తాతయ్య దగ్గరకు చేరుతుంది. శౌర్య తల్లిదండ్రులను వెతుకుతూ అదే ఊరిలో ఉండిపోతుంది. 


తర్వాత జనరేషన్
కొన్నేళ్ల తర్వాత అని హిమ-శౌర్య పెద్దయ్యాక చూపించారు. హిమ డాక్టర్ అయితే శౌర్య ఆటో డ్రైవర్ అవుతుంది. వీరిద్దరి మధ్య వైరంతో కొన్నాళ్లు కథ నడిచింది. అక్క చెల్లెళ్లని కలిపేందుకు సౌందర్య ఆనందరావు ప్రయత్నాలు చేస్తారు.  అమ్మా నాన్నవస్తేకానీ నిన్ను నమ్మనని శౌర్య గట్టిగా చెప్పడంతో..హిమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఆటోడ్రైవర్ వారణాసి ఎంట్రీ ఇచ్చి..మీ అమ్మా నాన్న బతికే ఉన్నారని క్లారిటీ ఇస్తాడు... అప్పుడు మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లింది... దీప-కార్తీక్-మోనిత రీ ఎంట్రీ ఇచ్చారు...


గతం మర్చిపోయిన కార్తీక్
దీప-కార్తీక్ బతుకుతారు కానీ కార్తీక్ గతం మర్చిపోతాడు..దీప కోమాలో ఉండి బయటపడుతుంది. అప్పటి నుంచి మళ్లీ డాక్టర్ బాబు కోసం తపించిపోతుంది. వెతుకుతుంది. అప్పుడు కూడా మోనిత భర్తగా కనిపిస్తాడు డాక్టర్ బాబు. గతం మర్చిపోవడంతో దీపను గుర్తుపట్టడు. అక్కడ కూడా ఎన్నో ప్రయత్నాల తర్వాత గతం గుర్తొచ్చేలా చేస్తుంది దీప... మోనిత కుట్రలన్నింటికీ చెక్ పెడుతూ సౌందర్య జైలుకి పంపిస్తుంది.


మోనిత జైలుకి వెళ్లడంతో కథ ముగింపు అనుకున్నారు
మోనిత జైలుకి వెళ్లడంతో కథ అయిపోతుంది అనుకుంటే.. మోనిత మనిషి అయిన చారుశీల చేతిలో పడతారు దీప-కార్తీక్. మరికొద్ది రోజుల్లో దీప చనిపోతుందని కుట్ర చేస్తుంది చారుశీల. ఎలాగైనా కార్తీక్ ను దక్కించుకుని ఆస్తి చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇలాంటి టైమ్ లో మోనిత వచ్చేసింది. ఇప్పుడు కార్తీక్ కోసం మోనిత-చారుశీల పోటీపడుతున్నారు. దీప కొద్దిరోజుల్లో చనిపోతుందనే ఆలోచనలోనే ఉన్నారంతా..కార్తీక్ ను తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోమని దీప అంటుంది.. దీప పోయాక కార్తీక్ ను పెళ్లిచేసుకోవాలని మోనిత, చారుశీల ఎవరికి వారే అనుకుంటారు..


ముగింపు ఇదేనా
మీరంతా మెచ్చే ముగింపు అని ప్రోమో వదిలారు కాబట్టి... అంతా మెచ్చే ముగింపు అంటే డాక్టర్ బాబు, వంటలక్క కలవడమే కదా...అంటే ఈ లెక్కన మోనితకు కార్తీక్ దక్కకుండా చేయాలంటే దీప బతకాలి కాబట్టి చారుశీల నిజం చెప్పేయవచ్చు. అదే జరిగితే మోనిత చేతిలో చారుశీల పోతుంది..మళ్లీ మోనిత జైలుకి వెళ్లిపోవడం అయినా జరగొచ్చు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత..దీప పూర్తిగా కోలుకున్నాక... తల్లిదండ్రులు, పిల్లల దగ్గరకు దీప కార్తీక్ చేరుకోవడంతో కథకు శుభం కార్డు పడొచ్చు...