సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కంగువా’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. రెండో భాగాన్ని మరింత భారీగా రూపొందించనున్నారని తెలుస్తోంది. ఇందులో సూర్యకు జోడిగా ఆలియా భట్‌ను తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం ఆలియా భట్ బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తుంది. దీంతో ఆలియా డేట్స్ కోసం ‘కంగువా’ టీమ్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.


‘కంగువా’ మీద సూర్య భారీ ఆశలు పెట్టుకున్నారు. థియేటర్లో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఎప్పుడో 2017లో వచ్చిన ‘సింగం 3’ తర్వాత సూర్యకు ఇంతవరకు సరైన హిట్ పడలేదు. ‘సురారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)’, ‘జై భీమ్’ సినిమాలు హిట్ అయినా అవి ఓటీటీ రిలీజులే. గతేడాది వచ్చిన ‘ఈటీ’ కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రకు బీభత్సమైన రెస్పాన్స్ రావడం ఒక్కటే ఊరట. దీంతో ‘కంగువా’కు తన కెరీర్‌లో దాదాపు రెండేళ్లు కేటాయించారు సూర్య. 2022 మార్చిలో ‘ఈటీ’ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘కంగువా’ పైనే కాన్సన్‌ట్రేట్ చేశారు.


ఇటీవల జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో కంగువాపై విపరీతమైన నమ్మకం వ్యక్తం చేశారు. ‘మేం ఊహించిన దాని కంటే 100 రేట్లు అద్భుతంగా 'కంగువా' వచ్చింది. ప్రస్తుతం నేను ఆ సినిమా పనుల్లోనే బిజీ బిజీగా ఉన్నాను.’ అని సూర్య చెప్పారు. 'కంగువా' టీజర్‌లో ప్రాచీన తెగకు చెందిన నాయకుడిగా సూర్య కనిపించారు. ఆయన పాత్ర లుక్ బట్టి చూస్తే చాలా వీరోచితంగా ఉంటుందని అర్థం అవుతోంది. టైటిల్ రివీల్ చేసినప్పుడు సూర్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అని చెప్పాలి.


వచ్చే ఏడాది వేసవిలో పది భాషల్లో ‘కంగువా’ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీలో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కంగువా'లో సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్, తెలుగు సినిమా 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ నటిస్తున్నారు. 'కంగువా' టీజర్‌ను కూడా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఇంగ్లిష్ వెర్షన్ టీజర్ కూడా రిలీజ్ అయింది.


అసలు ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా స్టూడియో గ్రీన్ నిర్మాతలు 'కంగువా'ను నిర్మిస్తున్నారని టీజర్ చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్‌లో ప్రతి ఫ్రేమ్‌లోనూ విజువల్ గ్రాండియర్ కనిపించింది. టీజర్, విజువల్స్ అంతా ఒక ఎత్తు అయితే దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య గీతం మరో ఎత్తు అని చెప్పాలి. కంగ, కంగ, కంగువా... అంటూ గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్ అందించారు డీఎస్పీ. ఈ టీజర్‌లో దేవి శ్రీ ప్రసాద్  రెగ్యులర్‌గా కాకుండా కొత్త తరహా సంగీతాన్ని వినిపించారు. దాంతో త్వరలో రానున్న పాటలపై కూడా అంచనాలు పెరిగాయి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial