రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ సినిమాపై సీనియర్ నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్, ధనుష్, అనుష్క శెట్టి, సిద్ధాంత్ చతుర్వేది, శిల్పా శెట్టి, రజనీ కాంత్, రిషబ్ శెట్టి నటనకు ఫిదా అయ్యారు. చాలా గొప్ప సినిమా తీశారని వెల్లడించారు. తాజాగా ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చూశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘కాంతార’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘కాంతార’ లాంటి చిత్రాలతో కన్నడ సినిమా రంగానికి పూర్వవైభవం వస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.


“కాంతార.. ఓ గొప్ప సినిమా. 2022లో నా మనసు దోచుకున్న సినిమా. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ విభిన్నంగా ఆలోచిస్తున్నారు. అలాంటి ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ సినిమా. కన్నడ సినిమా పరిశ్రమకు తిరిగి పాత రోజులు వస్తున్నాయి అనిపిస్తోంది” అని కమల్ తెలిపారు.


కమల్ హాసన్ ప్రశంసలపై ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి రియాక్ట్ అయ్యారు. కమల్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ తన ఇన్ స్టా స్టోరీగా పెట్టారు. ఈ సందర్భంగా లోకనాయకుడికి ధన్యవాదాలు చెప్పాడు. ‘‘కాంతారా మూవీ చూసిన తర్వాత కమల్ సార్ నాకు కాల్ చేశారు. గిరీష్ కన్నడ్ రూపొందించిన ‘కద్దు’ కూడా అడవి గురించే. కమల్ నటించిన ‘తేవర్ మగన్’ మూవీని ఆ సినిమా స్ఫూర్తితోనే తీశానని చెప్పారు. అలాగే ‘కాంతారా’ కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆయన కాల్ చేసినప్పుడు చాలా వణికిపోయాను’’ అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. 


‘కాంతార’ క్లైమాక్స్ గూస్‌ బంప్స్ తెప్పించింది- హృత్తిక్ రోషన్


బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇటీవలే ‘కాంతర’ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ మాటల్లో వర్ణించలేని విధంగా ఉందన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై ఆయన ప్రశంసలు కురిపించారు. “’కాంతార’ను చూసి చాలా నేర్చుకున్నాను. రిషబ్ శెట్టి నమ్మకం యొక్క శక్తి ఈ చిత్రాన్ని అసాధారణంగా నిలబెట్టింది. అగ్రశ్రేణి కథ, దర్శకత్వం, నటనతో ఆకట్టుకున్నాడు. పీక్ క్లైమాక్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు గూస్‌ బంప్స్ తెప్పించింది. టీమ్‌కి నా అభినందనలు” అని చెప్పాడు. ఆయన రిషబ్ శెట్టి ‘థ్యాంక్యూ సర్’ అంటూ రియాక్ట్ అయ్యాడు. 


‘కాంతార’ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై  విజయ్ కిరగందూర్, చలువే గౌడ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న తెలుగు, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. కన్నడనాట రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత విడుదలైన ప్రతి చోటా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొత్తంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి.. ఈ ఏడాది ఎక్కువ కలెక్షన్లు సాధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయినా, పలు చోట్ల థియేటర్లలోనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘కాంతార’ చిత్రంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ,  కిషోర్ కుమార్ జి కీలక పాత్రలు పోషించారు. హిందీ వెర్షన్ పలు బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చింది.  


Read Also: Urfi Javed: ఉర్ఫీ జావేద్ ఎవరు? ఎందుకు సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది?