Jyotika On Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కాథల్ ది కోర్'. ఇందులో మమ్ముట్టి సరసన జ్యోతిక కథానాయికగా నటించింది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుంది అనే కథాంశంతో జియో బేబి ఈ సినిమాను తెర‌కెక్కించింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో ఈ మూవీ కొనసాగుతోంది. న‌వంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మమ్ముట్టి మరోసారి తన నటన, హావభావాలతో ఆకట్టుకున్నారని పలువురు విమర్శకులు సైతం ప్రశంసించారు. జ్యోతిక నటననూ అందరూ మెచ్చుకున్నారు. మమ్ముట్టి భార్య పాత్రలో ఆమె జీవించారని వెల్లడించారు. సినిమాలో ఎమోషన్స్ హైలైట్ అని చెప్పుకొచ్చారు.


డైలాగుల కంటే మౌనమే బలం!


13 సంవత్సరాల తర్వాత 'కాథల్ ది కోర్' సినిమాతో మళ్లీ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జ్యోతికకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమాతో పాటు నటుడు మమ్ముట్టిపైనా జ్యోతిక ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ చిత్రంలో డైలాగుల కంటే మౌనమే ఎక్కువ మాట్లాడుతుందని చెప్పింది. ఈ సినిమాలో భార్య భర్తల మధ్య భౌతిక స్పర్శ లేకున్నా, ప్రేక్షకులను ఎంతో అలరించిందని వెల్లడించింది. ఈ చిత్రంలో కంటి చూపే చాలా విషయాలు చెప్పేస్తుందని తెలిపింది. చాలా సినిమాల్లో తాను గృహిణి పాత్రలు పోషించినప్పటికీ, ఈ సినిమాలో పాత్ర సరికొత్త అనుభవాన్ని కలిగించిందన్నారు. “ఈ సినిమా ప్రతి క్షణం కొత్తగా, తాజాగా అనిపించింది’’ అని తెలిపింది.


నిజమైన హీరో మమ్ముట్టి- జ్యోతిక


ఇక ఈ సినిమా విషయంలో నటుడు మమ్ముట్టి తీసుకున్న నిర్ణయం పట్ల తాను ఆశ్చర్యపోయానని జ్యోతిక తెలిపింది. “తొలి రోజు షూటింగ్ సమయంలో నేను అతడి దగ్గరికి వెళ్లి, ఈ పాత్రలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు? అని అడిగాను. హీరో అంటే ఏంటి? హీరో అంటే ఎవరినైనా కొట్టేవాడు కాదు. యాక్షన్, రొమాన్స్ చేసేవాడు కాదు. హీరో అంటే విభిన్నమైన పాత్రలను ప్రయత్నించే వాడు. విభిన్నమైన పాత్రల్లో నటించేవాడు. అతడే నిజమైన హీరో అని చెప్పారు. ఆయన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఆయను మెచ్చుకోవాలి అనిపించింది” అని తెలిపింది.


మమ్ముట్టిపై సిద్ధార్థ ప్రశంసలు


మరోవైపు నటుడు సిద్ధార్థ కూడా తాజాగా మమ్ముట్టిపై ప్రశంసలు కురిపించారు. “గత రెండు సంవత్సరాలుగా ఆయన ఎంచుకుంటున్న సినిమాలు మనసును కదిలించేవిగా ఉన్నాయి. నిజానికి అతడు ఎంచుకుంటున్న పాత్రలు నమ్మశక్యంగా ఉండటం లేదు. ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’ నుంచి 'కాథల్ ది కోర్' వరకు ఆయన ఎంచుకున్నక్యారెక్టర్లు అద్భుతం. తేడా జరిగితే తీవ్ర విమర్శలు వస్తాయని తెలిసినా, ఆయన ఒప్పుకుంటున్నారంటే అభినందించక తప్పదు” అని వెల్లడించారు.


2023లో మమ్ముట్టి నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'నాన్ పాకల్ నేరతు మాయక్కమ్', 'క్రిస్టోఫర్', 'కన్నూర్ స్క్వాడ్' సహా 'కాథల్ ది కోర్' సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.


Read Also: ‘ఆదిపురుష్‌’ ఎలా ఉన్నా, ‘హనుమాన్‌’ ఇలాగే ఉంటుంది- ప్రశాంత్‌ వర్మ