మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. విభిన్నమైన కథలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలు పాలైన తేజ్ కోలుకొని మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. SDJ 15 పేరుతో సినిమా పనులు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ చేస్తోన్న మొదటి సినిమా ఇదే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్, టీజర్ ను డిసెంబర్ 7 న విడుదల చేయనున్నట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే ఈ టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది. మెగా కాంపౌండ్ లో చాలా మంది టాప్ హీరోలు ఉండగా ఎన్టీఆర్ ను ఎందుకు పిలుస్తున్నారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనుక కూడా ఓ కారణం ఉందట.


సాయిధరమ్ తేజ్ కు జూనియర్ ఓన్టీఆర్ మంచి మిత్రుడు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, ఎన్టీఆర్ తో పాటు ఇంకొంత మంది మిత్రులు రెగ్యులర్ గా కలుస్తుంటారట. ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ స్నేహంతోనే ఇప్పుడు ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు రానున్నారని అంటున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో సినిమాల పరంగా హీరోల మధ్య పోటీ ఉన్నా ఒకరికొకరు ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేసుకుంటారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయమే. అయితే ఈ మధ్య టీజర్ లకు కూడా ఈవెంట్ లు నిర్వహిస్తుండటంతో వీటికి కూడా ఇతర హీరోలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సాయిధరమ్ తేజ్ కోసం వస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని వినికిడి. 


ఇక సాయిధరమ్ తేజ్ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ కు సుకుమార్ కథ అందిస్తుండగా కార్తీక వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా ‘కాంతార’ కు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. 


మరోవైపు, ఎన్టీఆర్ 30 సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వెెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారు. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 



Read Also: పూనమ్ కౌర్ ఆరోగ్యంపై అప్‌డేట్, రెండేళ్లుగా ఆ వ్యాధితో పోరాటం!