Jr NTR Visit Keshavanatheshwara Temple: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కర్ణాటకలోలోని ప్రసిద్ధ పురాతన పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్తున్నారు. ఆయనతో పాటు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాజాగా రిశబ్ శెట్టి స్వగ్రామానికి సమీపంలోని సుప్రసిద్ధ కేశవనాథేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. రిషబ్ శెట్టి సతీమణి ప్రగతి శెట్టి, ప్రశాంత్ నీల్ భార్య లిఖిత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతీ సైతం గుహలో కొలువై ఉన్నకేశవనాథేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. అక్కడి సహజ సిద్ధమైన అందాలు చూసి ఎన్టీఆర్ పులకించిపోయారు. అటవీ ప్రాంతలో ఉన్న అద్భుత ఆలయాన్ని చూసి మైమరిపోయారు. కేశవనాథేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న వీడియోను నటుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశారు. “A blessed journey to Keshavanatheshwara Temple  Moodagallu” అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ వీడియోను చూసి తెలుగు సినీ అభిమానులతో పాటు కన్నడ సినీ అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. 






ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్


ఇప్పటికే కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని జూనియర్ ఎన్టీఆర్ దర్శించుకున్నారు. అమ్మ శాలిని, భార్య ప్రణతీతో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఉడిపి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తన తల్లి ఎప్పటి నుంచో ఈ మఠానికి తీసుకురావాలని ప్రయత్నించిందని, చివరకు ఆమె కల నెరవేరిందని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నన్ను తన సొంతూరిలోని కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేయించాలని అమ్మ కలగనేది. ఇన్నాళ్లకు అమ్మ కోరిక నెరవేరింది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టిన రోజు. ఆమె బర్త్ డేకు ముందే స్వామి వారిని దర్శించుకోవడం ఆమెకు నేను ఇచ్చే బెస్ట్ గిఫ్టుగా భావిస్తున్నాను” అని రాసుకొచ్చారు. 


ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్‌ను రిసీవ్ చేసుకున్న రిషబ్ శెట్టి


అంతకు ముందు హైదరాబాద్ నుంచి మంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను.. రిషబ్ శెట్టి స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయనను ఉడిపి మఠానికి తీసుకెళ్లారు. అక్కడి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వామివారిని దర్శించుకున్నారు. అందరూ కలిసి అన్నదాన సత్రంలో భోజనం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ అమ్మమ్మ ఊరు మంగళూరు సమీపంలోని కుందాపుర. రిషబ్ శెట్టిది కూడా అదే ఊరు. ఇద్దరి మధ్య చిన్ననాటి నుంచే అనుబంధం ఏర్పడింది. ‘కాంతార’ ప్రీక్వెల్ లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పోషించనున్నట్లు టాక్ వినిపించడం, ప్రస్తుం వాళ్లిద్దరు కలిసి ఆలయాలకు తిరగడం ప్రేక్షకులలో ఆసక్తికలిగిస్తోంది. అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ‘డ్రాగన్’ అనే సినిమా చేయబోతున్నారు.


Read Also: ఇన్నాళ్లకు అమ్మ కల నిజం చేశా- పుట్టిన రోజుకు ముందే నెరవేర్చడంతో సంతోషంగా ఉందన్న ఎన్టీఆర్