సంతోష్ శోభన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే... కామెడీ, ఎమోషన్లకు పెద్ద పీట వేసినట్లు అర్థం అవుతుంది. అలాగే సినిమాలో ఫారిన్ లొకేషన్లు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి నిర్మాతలు ఖర్చుకు అస్సలు వెనకాడలేదు అని అనుకోవచ్చు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ చిన్నప్పటి సన్నివేశాలు, వారు ప్రేమలో పడటం, మధ్యలో ఫారిన్ లొకేషన్లు... ట్రైలర్ సగం వరకు ఇలా సరదా సరదాగా సాగింది. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి నేపథ్యంలో వచ్చిన గొడవలతో ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంది. రెండు కుటుంబాల మధ్య పెళ్లి, వారి మధ్య వచ్చే ఈగో సమస్యల నేపథ్యంలో కథ రాసుకున్నట్లు కనిపిస్తుంది.







తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల అయ్యింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ రెండు సినిమాలు ఆడియెన్స్ ను పెద్దగా అలరించలేకపోయాయి. అయినా, హిట్, ఫట్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ కు చెందిన స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నందిని రెడ్డి పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘సీతారామం’ హీరో దుల్కర్ సల్మాన్ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు.   


ఇక ‘అన్నీ మంచి శకునములే’ సినిమా టీజర్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చూస్తున్నంత సేపు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. ఈ టీజర్ పరిశీలిస్తే, వైజయంతి మూవీస్ నుంచి మరో చక్కటి సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కథ, చక్కటి కామెడీతో చూస్తూనే ఉండాలి అనిపించేలా ఉంది. టీజర్ ఆద్యంతం నిండుగా కనిపిస్తూ ఆకట్టుకుంది. తన సినిమాల్లో ఎమోషన్ ను పండించడంలో ముందుంటుంది నందినిరెడ్డి. తన గత సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మాళవికా నాయర్ చక్కగా సూటైనట్లు కనిపిస్తోంది.  రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్ సహా పలువురు నటీనటులు ఇందులో నటించారు.  మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల మాటలు అందించారు. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. జునైద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ వేసవిలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఎర్రటి ఎండ వేళ ఈ సినిమా ప్రేక్షకులకు చల్లటి పైరగాలి అందించేలా ఉండబోతోంది.