రువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయ స్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో  వారు చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది.


జీవిత, రాజశేఖర్ పై పరువు నష్టం కేసు ఎందుకు వేశారంటే?


జీవిత, రాజశేఖర్ దంపతులు 2011లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగా స్టార్ గా తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి, ప్రజల కోసం బ్లడ్ బ్యాంకుతో పాటు ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి రక్తం అందివ్వాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. అప్పట్లో ఈ బ్లడ్ బ్యాంకుకు సినీ అభిమానులు మద్దతు తెలిపారు. ఎన్నో వేల మంది రక్త దానం చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్త సాయం చేయాలని ఆకాంక్షించారు. అయితే, జీవిత, రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ బ్లడ్ బ్యాంక్ పేరుతో సినీ అభిమానుల రక్తాన్ని సేకరించి, డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వాళ్లు ఏకంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనం కలిగించాయి. చిరంజీవి రక్త నిధికి చాలా మంది రక్తం ఇచ్చేందుకు వెనుకాడారు.


పరువు నష్టం దావా వేసిన అల్లు అరవింద్


జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల సినీ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు జీవిత, రాజశేఖర్ దంపతుల వ్యాఖ్యలపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. వారిపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి గొప్ప మనసుతో చేస్తున్న మంచి కార్యక్రమం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కేసు ఫైల్ చేశారు. 2011 నుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ, తాజాగా ముగింపు దశకు వచ్చింది. మంగళవారం(జులై 18)నాడు ఈ కేసులో తుది తీర్పు వెల్లడి అయ్యింది. జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించడంతో అప్పీల్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు జీవిత, రాజశేఖర్ దంపతులకు న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది.


Read Also: అమెరికాలో అడుగు పెట్టిన ‘బాహుబలి’ బ్రదర్స్, శాన్ డియాగోలో ఇక రచ్చే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial