రజినీకాంత్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘జైలర్’ అప్‌డేట్స్ మెల్లగా మొదలయ్యాయి. మొదటిగా ఇందులో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. అదే ‘కావాలా’. వినడానికి తెలుగు పదంలా ఉందనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే. 70 శాతం తమిళం, 30 శాతం తెలుగులో ఈ పాట ఉండాలని పాట ప్రోమోలో నెల్సన్... సంగీత దర్శకుడు అనిరుథ్‌ను కోరారు.


ఈ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి నెల్సన్ మార్కు ఫన్నీ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. జులై 6వ తేదీన ఈ పాట విడుదల కానుంది. ‘నీకెలాంటి పాట కావాలి?’ అని అనిరుథ్... నెల్సన్‌ను అడిగినప్పుడు ‘తమన్నా థీమ్’ అని నెల్సన్ చెప్పారు. మరి పాట మూడ్ ఏంటి అని అనిరుథ్ అడిగినప్పుడు ‘మూడే మూడు. దానికి తగ్గట్లు పాట రెడీ చేసి పంపు.’ అని నెల్సన్ అన్నారు. దీన్ని బట్టి మొదటి పాట తమన్నా మీద ఉంటుందని అనుకోవచ్చు. ఆగస్టు 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.



‘వా నువ్వు కావాలయ్యా... నువ్వు కావాలయ్యా...’ అంటూ ఈ పాట సాగనుంది. రజినీ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో మలయాళ హీరో  మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు. వీరితో పాటు జాకీ ష్రాఫ్, సునీల్, రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మరిముత్తు, నమో నారాయణ, రిత్విక్, అనంత్, శరవణన్, అరంతాంగి నిషా, మహానటి శంకర్, కలై అరసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.


తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేస్తూ పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక జైలర్ మూవీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సెట్స్ లో  చిత్ర యూనిట్ తో కలిసి రజనీకాంత్ ఓ భారీ కేక్ ని కట్ చేస్తూ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.


ఈ కార్యక్రమంలో రజనీకాంత్ తో పాటు హీరోయిన్ తమన్నా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సినిమా టీమ్ అంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ జైలర్ రజనీకాంత్ ఓ జైలర్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో రజనీకాంత్ లుక్ కూడా అదిరిపోయింది.


వెండితెరపై రజినీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మరోసారి రమ్యకృష్ణ - రజినీకాంత్ కాంబినేషన్ ని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా 'జైలర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ చివరగా నటించిన 'అన్నాత్తే' మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కీర్తి సురేష్ ఈ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలిగా నటించింది. నయనతార, మీనా, కుష్బూ కీలకపాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ సినిమా 'పెద్దన్నయ్య' అనే పేరుతో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకుంది.