మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జాక్వెలిన్ కు బెయిల్ మంజూరు చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో ఆమె సహా మరికొందరు సినీ, వ్యాాపార ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులను బెదిరించడంతో పాటు 200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దీంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉండటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. సుకేష్‌తో జాక్వెలిన్ గతంలో డేటింగ్ చేసిందని, సన్నిహితంగా ఉందని బాలీవుడ్‌లో టాక్. ఆ టైం లో సుకేశ్, నటి జాక్వెలిన్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని, ఆమె కుటుంబ సభ్యులకు కూడా బహుమతులు ఇచ్చేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడితో సంబంధాలు కలిగి ఉండటం, కోట్ల విలువ చేసే గిఫ్టులు తీసుకోవడంతో ఈ కేసులో ఈడీ అధికారులు ఆమెను కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో  జాక్వెలిన్ ఫెర్నాండెస్ తో పాటు  మరోనటి నోరా ఫతేహి లాంటి వారితో సుఖేష్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవిలపై ఈడీ విచారిస్తోంది.


ఈ కేసులో జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ కి దరఖాస్తు చేసుకుంది. ఈ కేసులో ఈడీ నుంచి తమకు ఎలాంటి పత్రాలు అందలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను అందరికి అందజేయాలని ఈడీ కి సూచించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని తీర్పు చెప్పింది.


ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ ను మంగళవారం వరకు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆమె ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. అంతకంటే ముందు కోర్ట్ లో ఈడీ తన వాదనలను వినిపించింది. జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని, ఆమె దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోపించింది. కేవలం సరదాల కోసమే ఆమె 7.14 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని పేర్కొంది. ఈడీ వాదనలపై స్పందించిన కోర్ట్.. ఇప్పటిదాకా జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఆమె పై లుక్ అవుట్ నోటీసు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది.


బాలీవుడ్ నటి జాక్వెలిన్ పై దర్యాప్తు గడువు ఇప్పటికే ముగిసిపోవడం, చార్జిషీటు కూడా దాఖలు చేయడం, అలాగే ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో  జాక్వెలిన్ కు షరతు విధించింది న్యాయస్థానం. జాక్వెలిన్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులలో పేర్కొంది. 


 అయితే జాక్వెలిన్‌ను పలుమార్లు ప్రశ్నించడానికి పిలిపించిన ఈడీ.. మొదటిసారిగా చార్జ్‌ షీట్‌ లో జాక్వెలిన్ పేరును చేర్చింది. అయితే, గతంలో సమర్పించిన చార్జ్‌ షీట్‌ లో కానీ, సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించకపోవడం, నిందితురాలిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు వాటితో పాటు ఆమె సహ నటి నోరా ఫతేహి వాంగ్మూలం వివరాలను  కూడా ఈడీ పొందుపరిచింది.