బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తన విలాసవంతమైన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో జుహులో ప్రియాంక చోప్రా నివసించిన బంగళాలో ఉన్న జాక్వెలిన్, ప్రస్తుతం  బాంద్రాలోని ప్రసిద్ధ పాలి హిల్‌కి మరింది. ఈమె కొత్త బంగాళా పరిసరాల్లోనే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు.  


లగ్జరీ బంగళా కొనుగోలు చేసిన జాక్వెలిన్


తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో జాక్వెలిన్ షేర్ చేసిన కొత్త ఇంటి ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇల్లు ఎంతో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ విలాసవంతమైన బంగళాను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదంటున్నారు. భవనం లోపల, బటయ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇల్లు బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ లో ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.  ఈ భవనాన్ని నిర్మించిన కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, కాంప్లెక్స్ లో అనేక ఆప్షన్లలో ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వీటిలో ది సూట్స్, ది పెంట్‌హౌస్, స్కై విల్లా, మాన్షన్ ఉన్నాయి. ప్రాథమిక ఇంటి ఎంపిక, 1,119 చదరపు అడుగుల దగ్గర మొదలై 2,557 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా వరకు ఉంటుంది. తాజా నివేదిక ప్రకారం ఈ కాంప్లెక్స్ అందించే చౌకైన రెసిడెన్షియల్ ఆప్షన్ ధర రూ. 12 కోట్లు. జాక్వెలిన్ తన కొత్త అపార్ట్‌ మెంట్‌లోకి వెళ్లిందా? లేదా? అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  






వరుస సినిమాలతో బిజీ


ఇక ప్రస్తుతం జాక్వెలిన్ పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ వైభవ్ మిశ్రా చిత్రం ‘ఫతే’లో నటిస్తోంది. ఇందులో ఆమె సోనూ సూద్, విజయ్ రాజ్‌ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ క్రైమ్ యాక్షన్ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఈ ఏడాది మార్చిలో జాక్వెలిన్ ముగించింది. అటు ఆదిత్య దత్ యాక్షన్ స్పోర్ట్స్ ఫిల్మ్ ‘క్రాక్ - జీతేగా తో జియేగా’లో కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె విద్యుత్ జమ్వాల్,  అర్జున్ రాంపాల్‌తో కలిసి కనిపించనుంది.


గత కొంతకాలంగా వివాదాలతో సాహవాసం


అటు పలు వివాదాలతో జాక్వెలిన్ గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ తో ఆమెకు దగ్గర సంబధాలున్నట్లు వార్తలు వచ్చాయి.  ఆయన నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వచ్చిన వార్తలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. పలుమార్లు ఆమెను విచారించారు కూడా. అయితే, తనను కావాలని ఈ కేసులో ఇరికించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది.  ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఆయా ప్రత్యేక సందర్భాల్లో సుకేష్ జైలు నుంచే జాక్వెలిన్ కు లేఖలు రాయడం విశేషం.


Read Also: ‘భోళాశంకర్’ నుంచి సాలిడ్ అప్ డేట్, స్పెషల్ ట్వీట్ చేసిన దర్శకుడు మెహర్ రమేష్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial