దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. గత నెలలో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి లండన్ వెకేషన్ కు వెళ్లారు ప్రిన్స్. ఆయన బర్త్ డే వేడుకలు పూర్తయ్యాక లండన్ నుంచి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే సంక్రాంతి(2024)కి విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.  


‘గుంటూరు కారం’ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి


నిజానికి మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో పెద్దగా ట్విస్టులు ఉన్నాయో? లేదో? తెలియదు కానీ, దాని నిర్మాణం మాత్రం ట్విస్టులతో నిండిపోయింది. ఆయా కారణాలతో సినిమా చాలాసార్లు వాయిదా పడింది. చివరకు స్క్రిప్ట్ కూడా మార్చారు.  క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా హీరోయిన్ పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుంది. సినిమాటోగ్రాఫర్‌ కూడా మారిపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తొలగించబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవి నిజం కాదని తేలిపోయింది. పూజా తప్పుకున్న తర్వాత మీనాక్షి చౌదరి ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. పూజా ఉన్నప్పుడే శ్రీలీలను సెకెండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. పూజా తప్పుకోవడంతో శ్రీలీల క్రేజ్‌ని బట్టి ఆమే హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. అయితే, త్రివిక్రమ్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారట. ‘అవుట్ ఆఫ్ లవ్’లో మీనాక్షి నటన బాగా నచ్చడంతో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా బయటకు తెలియకపోయినా, సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే, శ్రీలీల ఎలా రియాక్ట్ అవుతోందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.


వచ్చే సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదల


ఇక 'గుంటూరు కారం' సినిమా జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ రైటర్, దర్శకుడు త్రివిక్రమ్ తెరెక్కిస్తున్న ఈ సినిమాను  హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  జయరామ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజర్, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 


మహేష్ తో సినిమా చేస్తున్న రాజమౌళి


అటు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. #SSMB29 పేరుతో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. రాజమౌళి ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఈ సినిమా కథా రచయిత  KV విజయేంద్ర ప్రసాద్, ‘RRR’ను తలదన్నేలా #SSMB29 ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. యాక్షన్, థ్రిల్లర్ డ్రామాతో నిండిన అడ్వెంచర్ మూవీగా రూపొందబోతున్నట్లు తెలిపారు.  ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Read Also: బాలయ్యా మజాకా!, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న 'భగవంత్ కేసరి' గణేష్ యాంథమ్!









Join Us on Telegram: https://t.me/abpdesamofficial