‘‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతితప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే’’.. అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన పాట అది. అలా ఆ అమ్మాయి అరనవ్వుకు చాలామంది కుర్రాళ్లు మంచాన పడ్డారు. చార్మింగ్ స్మైల్‌తో డీసెంట్ లుక్సుతో అందరి మదిని దోచుకున్న భూమిక.. ఇవాళ (ఆగస్టు 21) పుట్టిన రోజు జరుపుకుంటోంది. దాదాపు అందరు యువ హీరోలు, సీనియర్లతో కూడా సినిమాలు చేసిన భూమిక చాలా కాలం టాలీవుడ్‌లో లీడ్‌ హీరోయిన్‌గా ఉంది. ఇప్పుడు సెకండ్‌ ఇన్సింగ్స్‌‌‌లో కారెక్టర్ రోల్స్ కూడా చేస్తోంది. మరి, భూమికకు.. పవన్, మహేష్, ఎన్టీఆర్‌లకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటనేగా సందేహం. అయితే.. అసలు విషయంలోకి వెళ్లిపోదాం. 


ఆ ముగ్గురు హీరోలు- భూమిక: తెలుగులో టాప్‌ హీరోలు అందరితో భూమిక నటించింది. అయితే ఓ ముగ్గురు హీరోలతో ఆమె నటించిన సినిమాలకు మామూలు క్రేజ్ రాలేదు. 2001 లో విడుదలైన ఖుషి అప్పట్లో ఒక ఊపు ఊపింది. పవన్ కల్యాణ్, భూమిక కాంబినేషన్ మామూలుగా వర్కవుట్ కాలేదు. మొదటి సారిగా భూమిక -పవన్ కలిసి నటించారు. ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్. అంతే కాదు, పవన్ కెరీర్‌లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్.


ఇక 2003లో వచ్చిన ఒక్కడు. మహేష్‌బాబు కెరీర్‌ను మార్చేసిన మూవీ అది. రాయలసీమ అమ్మాయిగా అమాయకపు లుక్స్‌తో కనిపించిన భూమికను చూసి  ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఇది మహేష్‌బాబు కెరీర్‌కు అప్పటికి బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాలోనే మహేష్ భూమిక తొలిసారి కలిసి నటించారు. ఇక అదే ఏడాది వచ్చిన సింహాద్రి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమా ఆ ఏడాదికే కాదు.. అప్పటికి ఆల్‌టైమ్ టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టింది. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్‌తో తొలిసారి నటించిన గోల్డెన్‌ గర్ల్ భూమికనే! అలా ఈ ముగ్గురు హీరోలూ భూమికతో నటించిన మొదటి సినిమాలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. 


ఇంట్రస్టింగ్ పాయింట్ ఇదే: ఈ మొత్తం పరిణామంలో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈ ముగ్గురికీ అది తమ ఏడో సినిమా..! పవన్ కల్యాణ్ ఏడో మూవీ ఖషీ అయితే, మహేష్‌కు ఒక్కడు.. ఎన్టీఆర్‌కు సింహాద్రి. ఈ మూడు హిట్లలో ఉన్న కామన్ విషయాలు భూమిక, ఏడు అనే నెంబర్. ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే... ఈ మూడు సినిమాలు ఎంత పెద్ద హిట్లో.. ఆ తర్వాత వారి నుంచి వచ్చిన ఎనిమిదో సినిమా అంత పెద్ద డిజాస్టర్లు. పవన్ కల్యాణ్  జానీ, మహేష్ నిజం, ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఇవన్నీ వాళ్ల ఎనిమిదో సినిమాలు. ఇవి వాళ్ల కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్లు కూడా..! అయితే.. ఈ మూడింట్లో మాత్రం భూమిక లేదు.


2000 సంవత్సరంలో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భూమిక.. మొదటి సినిమాతోనే అందరికీ నచ్చేసింది. 2001లో విడుదలైన ‘ఖుషీ’ సినిమాతో కుర్రకారు మది దోచింది. ‘నడుము’ అంటే భూమికానే గుర్తొచ్చెంతగా ఈ చిత్రంలోని సీన్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘మిస్సమ్మ’ సినిమాతో భిన్నమైన పాత్రలు కూడా చేయగలనని నిరూపించింది. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా మారిపోయింది. 2007, అక్టోబరు నెలలో భూమిక తన బాయ్‌ఫ్రెండ్, యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2010లో ‘కలెక్టర్ గారి భార్య’ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు. 2014లో ‘లడ్డు బాబు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. 


Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!


మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత 2017లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి-ఎంసీఏ’ సినిమాతో నానికి వదినగా నటించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘యుటర్న్’, ‘సవ్యసాచి’ చిత్రాల్లో నటించింది. తాజాగా విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రంలో హీరోకు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. భూమిక అసలు పేరు.. రచనా చావ్లా. 1978, ఆగస్టు 21న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించింది. భూమిక తండ్రి విశ్రాంత సైన్యాధికారి. 1997లో ముంబయిలో ప్రకటనల్లో కనిపిస్తూ.. పలు హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్‌లో నటించింది. 


Also Read: హీరోగా మారబోతున్న బండ్ల గణేష్.. ఆ చిత్రం రీమేక్‌తో థ్రిల్ చేస్తారట!