కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ 29న ఆయన కన్నుమూశారు. ఎంతో ఫిట్ గా ఉండే పునీత్ హార్ట్ ఎటాక్ తో చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇప్పటికే పునీత్ ను గుర్తుచేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. తాజాగా పునీత్ నటించిన చివరి సినిమా 'జేమ్స్'(James) విడుదలకు సిద్ధమైంది. 


ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా సినిమా తెలుగు టీజర్ ను నటుడు ప్రభాస్ రిలీజ్ చేశారు. 'జేమ్స్ రూపంలో ఒక మాస్టర్ పీస్ ను చూడబోతున్నామని.. పునీత్ ని అభిమానించిన కోట్ల మందికి ఇదొక స్పెషల్ ఫిలింగా నిలిచిపోతుందని' ప్రభాస్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వరల్డ్ మాఫియా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. 


'ఈ ప్రపంచంలో మొత్తం మూడు రకాల మార్కెట్లు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్, డీప్ మార్కెట్ అండ్ డార్క్ మార్కెట్. ఇట్స్ ఏ వరల్డ్ మాఫియా' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. 'గన్స్‏ పట్టుకొని నిలబడే వంద వేస్ట్ బాడీస్ కంటే.. గన్ లాంటివాడిని ఒక్కడిని వెతికి తీసుకురండి.. ఎదురు నిలబడి కాపాడడం తెలసుండాలి. ఎదురొచ్చే గుండెలో బుల్లెట్టు దింపడం తెలుసుండాలి' అంటూ నటుడు శ్రీకాంత్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 'నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే అలవాటు' అంటూ పునీత్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 


భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివకుమార్ డబ్బింగ్ చెప్పారు. చేతన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కిషోర్ పత్తికొండ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అయిన మార్చి 17న రిలీజ్ చేయనున్నారు.