2019లో విడుదలైన 'జెర్సీ' సినిమా తరువాత నాని ఇప్పటివరకు సరైన సక్సెస్ ను అందుకోలేకపోయారు. ఆయన నటించిన 'గ్యాంగ్ లీడర్', 'వి', 'టక్ జగదీష్' లాంటి సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. 'వి', టక్ జగదీష్' రెండు సినిమాలు కూడా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై పడింది. సినిమాలకు బ్యాడ్ టాక్ వచ్చినా కూడా.. నిర్మాతలు లాభాలకే సినిమాలను ఓటీటీలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. 



ఇటీవల నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. సాయి పల్లవి, కృతిశెట్టి లాంటి హీరోయిన్లు నటించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు 'అంటే సుందరానికి' అనే మరో సినిమా కూడా లైన్ లో పెట్టారు నాని. వివేక్ ఆత్రేయ  డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


వీటితో పాటు నాని మరో కొత్త సినిమా మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. నాని 29వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ దసరా కానుకగా అక్టోబర్ 15న రానుంది. మద్యాహ్నం 1:53 నిమిషాలకు సినిమా అప్డేట్ కు ముహూర్తం పెట్టారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరి పేరుని అనౌన్స్ చేస్తారో చూడాలి!