2019లో వచ్చిన 'మత్తు వదలరా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు రితేష్ రానా. ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని 'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ దర్శకుడు. లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, సత్య లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం వెరైటీగా ప్రమోషన్స్ చేశారు. 

 

ఈ మధ్యకాలంలో ఇంత డిఫరెంట్ ప్రమోషన్స్ ఎవరూ చేయలేదు. దీంతో సినిమాపై కాస్త బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్ తోనే కామెడీ పండించిన ఈ టీమ్ థియేటర్లలో మరింత సందడి చేస్తుందన్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. శని, ఆదివారాలు కూడా కలెక్షన్స్ డల్ గా ఉన్నాయి. మౌత్ టాక్ లో కూడా నెగెటివ్ గా రావడంతో జనాలు సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 

 

ఫస్ట్ హాఫ్ ఫన్నీగా, ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ అయింది. నిజానికి దర్శకుడు రితేష్ రానా సాలిడ్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకోలేకపోయారు. కామెడీతో నడిపించేయాలని అనుకున్నారు. అలా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ రితేష్ రాసుకున్న కామెడీ సీన్లు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఒకటే జోక్ ని నాలుగైదు సార్లు చెప్తే ఎలా వర్కవుట్ అవుతుంది..? 'హ్యాపీ బర్త్ డే' విషయంలో కూడా అదే జరిగింది. 

 

మీమ్స్ ని స్టోరీలో ఇన్వాల్స్ చేస్తూ తన క్రియేటివిటీని చూపించిన రితేష్ రానా.. బహుశా స్క్రిప్ట్ విషయంలో కూడా ఆ క్రియేటివిటీ చూపించి ఉంటే సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచేది. ఫైనల్ గా ఈ సరియల్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించినా రితేష్ రానా ప్లాన్ మాత్రం వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి!