Shivaraj Kumar As Gummadi Narasaiah in biopic: వామపక్ష ఉద్యమ చరిత్రలో ఒక జీవించే అధ్యాయం – మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ ను శుక్రవారం పాల్వంచలో ప్రారంభించారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ నర్సయ్య పాత్రలో నటిస్తున్నారు.
స్వయంగా శివరాజ్కుమార్ ఇల్లెందుకు వచ్చి నర్సయ్యను కలిశారు. ఇలాంటి మహానుభావుడిని బెంగళూరు పిలుచుకోవడం కన్నా, నేనే వచ్చి కలవడమే గౌరవం అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. నర్సయ్య జీవితం గురించి తెలుసుకున్నాకే తాను ఈ పాత్రకు యస్ చెప్పినట్లుగా తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ వామపక్ష ఉద్యమంలో గుమ్మడి నర్సయ్య ది ప్రత్యేక అధ్యాయం. ఇల్లెందు నియోజకవర్గం నుంచి 1983 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 25 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా ఉన్నా ఒక్క పైసా కూడా వ్యక్తిగతంగా సంపాదించుకోలేదు. ఎమ్మెల్యే జీతం మొత్తం పార్టీకి ఇచ్చేశారు. ఇప్పుడు వస్తున్న పెన్షన్లో కొంత భాగం మాత్రమే తన అవసరాలకు ఉంచుకుని మిగతా డబ్బు కూడా పార్టీకి అందజేస్తున్నారు.
ఆయన ఇల్లు ఇప్పటికీ అదే పాత గుడిసె. లగ్జరీ కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు. ఒక్క బైక్ కూడా లేదు. పార్టీ కార్యకర్తలు వచ్చినప్పుడు తనే ఆటోలో పిలిచి వెళ్తారు. రాజీకాయుల డబ్బు మయం అయిన తర్వాత ఎన్నికల్లో నర్సయ్య వెనుకబడ్డారు. కానీ తన సిద్ధాంతాలను, జీవనశైలిని ఒక్క రోజు కూడా మార్చుకోలేదు. ఇప్పటి రాజకీయ నాయకులు గుమ్మడి నర్సయ్య జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. డబ్బు, అధికారం కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలు చేయాలని ఈ చిత్రం చాటాలి అని కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.