ఎట్టి పరిస్థితుల్లో దివ్య జీవితం నాశనం చేసి నరకం చూపిస్తానని రాజ్యలక్ష్మి ప్రియని బెదిరిస్తుంది. పని మనిషి కాంతంని పిలిచి ప్రియని బయటకి వదలొద్దని అప్పటి వరకు తనకి ఇదే జైలు అనేసి వెళ్ళిపోతుంది. తులసి వాళ్ళు పెళ్లి మండపానికి బయల్దేరబోతుంటే అందరి కంటే ముందుగానే దివ్య కారులో ఎక్కి కూర్చుంటుంది. హడావుడిలో నన్ను ఎక్కడ మర్చిపోతారో అని ముందుగానే ఎక్కి కూర్చున్నా అనేసరికి అందరూ నవ్వుతారు. అనసూయ దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతుంది. గుడిలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. పెళ్లి మండపంలో తులసి అందరికీ ఒక్కొక్క పని చెప్తూ ఉంటుంది. నందు వచ్చి తులసి కనిపించిందా అని అందరినీ అడుగుతాడు. అబ్బా ఎంత ముద్దుగా పిలిచ్చాడో కూతురు పెళ్లి అయ్యేలోపు నన్ను పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయేలా ఉన్నారని లాస్య మనసులో అనుకుంటుంది. తులసి రాగానే మగ పెళ్లి వాళ్ళు దగ్గరకి వచ్చారని చెప్పి తీసుకుని వెళతాడు.


Also Read: అర్థరాత్రి కనకం ఇంటికి స్వప్న, ఎదురుపడిన రాజ్- అపర్ణకి ఫోన్ చేసి నిజం చెప్పిన కావ్య


నందు కుటుంబం దగ్గరుండి మరీ రాజ్యలక్ష్మి కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. లాస్య రాజ్యలక్ష్మితో రాసుకుని పూసుకుని తిరగడం చూసి నందు అడిగేస్తాడు. డబ్బు ఉంది కదా అని పిచ్చి వేషాలు వేయకు ఇబ్బందులు క్రియేట్ చేయకని లాస్యని హెచ్చరిస్తాడు. నా సమస్యలో దివ్యని ఇన్వాల్వ్ చేశాను. నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుంటే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. ఇరక్కపోయి నేను ఈ ఊబిలో ఇరుక్కుపోయాను. రాజ్యలక్ష్మి నా నోరు నొక్కేయడమే కాదు నన్ను గదిలో బంధించారు. అన్యాయం జరుగుతుంది వెంటనే గుడికి వెళ్ళి విక్రమ్ పెళ్లి ఆపాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని రక్షించాలి. దయచేసి తలుపులు తీయమని ప్రియ బతిమలాడుతుంది. తలుపు తీస్తే ఏమవుతుందో మీకు తెలుసు అర్థం చేసుకోమని పని మనిషి కాంతం చెప్తుంది. పెళ్లి పీటల మీద కూర్చున్న విక్రమ్ దివ్య కోసం వెతుకుతూ ఉంటాడు. అటు దివ్యతో గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు.


గౌరీ పూజ విశిష్టత గురించి సరస్వతి గొప్పగా చెప్తుంది. నవ్వుతూ కష్టాలు భరించాలి. పెళ్లి చేసుకున్న ప్రతీ ఆడపిల్లకి ఈ లక్షణాలు ఉండాలని గుర్తు చేసుకుంటూ పెళ్లి కూతురితో గౌరీ పూజ చేయిస్తామని అంటుంది. పాపం అమ్మమ్మ చాలా కలలుకంటుంది కానీ దివ్య జీవితం నాశనమవుతుందని లాస్య మనసులో అనుకుంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని తులసి చెప్తుంది. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటుంది కష్టాలు తన ఇంటి గడప దాకా కూడా వెళ్లదని నందు సంబరపడతాడు. విక్రమ్ పెళ్లి పీటల మీద కూర్చున్నాడనే కానీ దివ్య కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తాడు. అది చూసి విక్రమ్ తేడాగా ఉన్నాడు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని బసవయ్య అక్కని హెచ్చరిస్తాడు. కాసేపటికి దివ్యని మేనమామలు బుట్టలో ఎత్తుకుని మండపానికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. లాస్య కళ్ళతోనే తన కోరిక తీరబోతుందని రాజ్యలక్ష్మికి సైగ చేస్తుంది.


Also Read: జానకిని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమన్న జ్ఞానంబ- భర్త కోసం మధు డీల్ కి తలొంచుతుందా?


ఇంట్లో దివ్య ఈ ఇంట్లో కాలు పెట్టేలోగా నేను ఈ లోకం వదిలి వెళ్లిపోతానని ప్రియ అంటుంది. ఆ మాటలకి పని మనిషి కాంతం కరిగిపోయి ప్రియ గది తలుపు తీస్తుంది. వెళ్ళి వెంటనే పెళ్లి ఆపేయమని కాంతం చెప్తుంది. దీంతో ప్రియ గుడికి వెళ్ళి నందుకి అసలు నిజం చెప్పేస్తుంది.