నటి సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఎప్పటిలాగే బాలయ్య తనదైన శైలిలో డైలాగులు, యాక్షన్ సీన్లతో రఫ్పాడించారు.


‘నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్.’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. యూత్ ను ఆకట్టుకునేలా పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్ ల్లో వినిపించే స్లోగన్ జై బాలయ్య అంటూ విజిల్స్ కొట్టించారు NBK. ఇక పొలిటకల్ టచ్ లకూ ట్రైలర్ లో కొదవలేదు. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో - ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అంటూ పొలిటికల్ ఫైర్ రగిల్చాడు వీరసింహం. 


అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను ఒంటి చేత్తో ఊచకోత అంటూ బ్లడ్ బాయిల్ చేసే డైలాగులు చెప్పాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తారీఖున సినిమా రిలీజ్ కానుంది. ఒంగోలులో గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.


మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.


ఇక అమెరికాలో కూడా వీర సింహా రెడ్డి దూకుడు చూపిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే... బాలకృష్ణ సినిమా ప్రీ సేల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 'వీర సింహా రెడ్డి' ప్రీ సేల్స్ అమెరికాలో 1.61 లక్షల డాలర్లను దాటాయి. అంటే మనదేశ కరెన్సీలో రూ.1.32 కోట్లు అన్నమాట. సినిమా విడుదలకు ఇంకా ఆరు రోజుల సమయం ఉంది.


ఒక్కో షో ఫుల్ అవుతూ ఉండటంతో స్క్రీన్లు కూడా యాడ్ చేస్తూ వెళుతున్నారు. సినిమా విడుదల దగ్గర పడే సమయానికి ఇంకా చాలా షోలు పడే అవకాశం ఉంది. ఒక్క అమెరికా నుంచి మొదటి రోజు, అంతకు ముందు ప్రీమియర్ షో కలుపుకొంటే మనదేశ కరెన్సీలో రూ.ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


బ్లాక్‌బస్టర్ ఆడియో
ఇప్పటి వరకు 'వీర సింహా రెడ్డి' సినిమాలో మూడు పాటలను విడుదల చేశారు. ఆ మూడు పాటల్లో 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' సాంగ్ హైలైట్. నారి నారి నడుమ అన్నట్టు.... హీరోయిన్ హానీ రోజ్, 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఫేమ్ చంద్రికా రవితో బాలకృష్ణ వేసిన స్టెప్పులు మాస్‌ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కూడా ఆ సాంగ్ చాలా  స్పెషల్‌గా ఉండబోతోందని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 


తొలుత 'జై బాలయ్య' పాటపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ మెల్లగా జనాల్లోకి ఎక్కేసింది. 'సుగుణ సుందరి' పాటలో శ్రుతి హాసన్‌తో బాలకృష్ణ వేసిన స్టెప్పులు కూడా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’, ‘కళ్యాణం కమనీయం’ వంటి సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో సంక్రాంతి పండగ విన్నర్ గా ఎవరు నిలబడతారో వేచి చూడాలి.