తెలుగు దర్శకుడు తెరెకెక్కించిన 'RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఇండియాలో సంచనల విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విదేశాల్లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జపాన్ లాంటి దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రూ. 500 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్లు సాధించింది.


‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు


తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును దక్కించుకుంది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఈ అవార్డును అందుకుంది. ఈ కేటగిరీలో అవార్డు పొందిన  మొదటి భారతీయ పాటగా నిలిచింది.చిత్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అవార్డును తీసుకున్నారు. ఆస్కార్ కు ఎంట్రీగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈ సినిమాకు దక్కడంతో, కచ్చితంగా ఆస్కార్ అవార్డును సైతం అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రావాలని ఆకాంక్షిస్తున్నారు.  


‘RRR’ బాలీవుడ్ మూవీకాదు, సౌత్ ఇండియన్ తెలుగు సినిమా!


అటు 'RRR’ సినిమాకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ చిత్రం బాలీవుడ్ మూవీ కాదని వెల్లడించారు. సౌత్ ఇండియాకు చెందిన తెలుగు చిత్రం అని చెప్పారు.  డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో 'RRR’ సినిమా ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడారు. ఇండియన్ మూవీ అనగానే అందరూ బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారని చెప్పారు. కానీ, అది వాస్తవం కాదన్నారు."’RRR’ అనేది బాలీవుడ్ చిత్రం కాదు, ఇది  దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన తెలుగు సినిమా. మీకు సంగీతం, నృత్యం ఇవ్వడం కంటే కథను ముందుకు తీసుకెళ్లడానికి మేము ‘నాటు నాటు’ అనే పాటను ఉపయోగించాం” అని చెప్పారు.  అటు మూడు గంటల సినిమా  చూస్తుండగానే అయిపోందని ప్రదర్శనకు వచ్చిన సినీ ప్రముఖులు చెప్పడం పట్ల రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. "సినిమా చివర్లో మూడు గంటలు అనిపించలేదని మీరు చెప్పడం సంతోషంగా ఉంది. మీకు ఆ ఫీలింగ్ కలిగిందంటే  నేను విజయవంతమైన ఫిల్మ్ మేకర్ అని భావిస్తున్నా” అన్నారు.   


2022లో విడుదలైన  ‘RRR’  పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.






Read Also: సంపాదనలో దూసుకుపోతున్న షారుఖ్, ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల లిస్టులో చోటు