Orry: సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఓవర్ నైట్ ఫేమస్ అయిపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఓర్రీ. గత కొద్ది రోజులు ఈయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. దిగ్గజ వ్యాపారవేత్తల నుంచి, బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సెల్ఫీలతో ఆయన లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కూడా. సెల్ఫీలతో సంపాదన ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయాన్ని ఓర్రీ స్వయంగా చెప్పడం విశేషం.  


వేడుక ఏదైనా ఓర్రీ ఉండాల్సిందే!


కొద్ది రోజుల క్రితం వరకు ఓర్రీ ఎవరో ఎవరికీ తెలియదు. రీసెంట్ గా  ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో పాటు బాలీవుడ్ స్టార్స్, స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్, కత్రీనా కైఫ్, కరీనా కపూర్ సహా పలువురితో క్రేజీ సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒకే దెబ్బతో ఓర్రీ సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ వేడుక జరిగినా ఓర్రీ ఉండాల్సిందే. అందరితో సెల్ఫీలు దిగాల్సిందే! అన్నట్లుగా మారిపోయాడు. వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మొదలు కొని బాలీవుడ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. 


ఒక్కో ఫోటోకు రూ. 20 లక్షల నుంచి 30 లక్షల సంపాదన


రీసెంట్ గా ఓర్రీ  బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో రెండు రోజుల పాటు స్పెషల్ గెస్టుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా షో హోస్ట్ సల్మాన్ ఖాన్ తో మాట్లాడాడు. ఈవెంట్స్ లో దిగే ఫోటోల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒక్కో ఈవెంట్ లో ఫోటోలు దిగడం వల్ల రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. సెలబ్రిటీలు ఆయా వేడుకలకు తనను ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారని వెల్లడించాడు. వ్యాపారవేత్తలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగాలని కోరుతారని చెప్పాడు. ఆయా పార్టీల్లో ఫోటోలు దిగడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఒక్కో ఫోటోలకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు డబ్బులు వస్తాయని వెల్లడించాడు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాటలను తానే ఖండించాడు. అంత డబ్బు వస్తే ఒక ద్వీపంలో విలాశవంతంగా జీవించేవాడిని అని తెలిపాడు. 


ఇంతకీ ఒర్రీ ఎవరు?


ఒర్రీ అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతడు  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్‌పర్సన్ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫైన్ ఆర్ట్స్, కమ్యూనికేషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తనకు ఐదుగురు మేనేజర్లు ఉన్నట్లు ఓర్రీ తెలిపాడు. వారిలో ఇద్దరు సోషల్ మీడియా మేనేజర్లు, ఒక పిఆర్ మేనేజర్, ఒక ఓవరాల్ బ్రాండ్ మేనేజర్, ఒక ఫుడ్ మేనేజర్ ఉన్నట్లు చెప్పాడు. తాను ఏమి తినాలో చూడడమే ఫుడ్ మేనేజర్ పని అని ఓర్రీ వెల్లడించాడు.  


Read Also: బాబాయ్ హోటల్‌లో వెంకీ మామ సందడి - శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి ఇంద్రకీలాద్రిపై వెంకటేష్ ప్రత్యేక పూజలు