రవితేజ-రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఖిలాడి' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి దర్శకుడికి, రవితేజకి ఏదో డిస్టర్బన్స్ ఉన్నట్లుగానే అనిపించింది. దానికి తగ్గట్లే రమేష్ వర్మ భార్య.. రవితేజను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేసింది. ఫైనల్ గా సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న గ్యాప్ ను 'ఖిలాడి' క్యాష్ చేసుకుంటాడని భావించారు దర్శకనిర్మాతలు. 

 

'అఖండ', 'పుష్ప' హవా తగ్గడంతో 'ఖిలాడి' సినిమా తప్ప ఆడియన్స్ కు మరో ఆప్షన్ ఉండదని అనుకున్నారు. వసూళ్ల పరంగా సినిమా సత్తా చాటుతుందనుకున్నారు. కానీ 'డీజే టిల్లు' సినిమా రిలీజయింది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అందుకుంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 'ఖిలాడి' చెక్ పెట్టినట్లైంది. 

 

ఫస్ట్ డేనే సినిమాకి హిట్ టాక్ వచ్చింది. లాజిక్స్ లేనప్పటికీ ఫన్ బాగా వర్కవుట్ అవ్వడంతో సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. శనివారం నాడు విడుదలైన ఈ సినిమాకి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. చాలా మంది 'డీజే టిల్లు' సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యూత్ మొత్తం కూడా ఈ సినిమాకే క్యూ కడుతున్నారు. మొత్తానికి 'ఖిలాడి'పై 'డీజే టిల్లు' ఎఫెక్ట్ పడినట్లే. వీకెండ్ పూర్తయ్యేసరికి 'డీజే టిల్లు' థియేటర్లను కూడా పెంచే ఛాన్స్ ఉంది. అలా చూసుకుంటే 'ఖిలాడి' కొన్ని థియేటర్లను వదులుకోవాల్సిందే!