మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన 'భోళాశంకర్' బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  చక్కటి కంటెంట్ ఉన్న కథలకు ఇంపార్టెన్సీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'బింబిసార' దర్శకుడు వశిష్టతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.  UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

  


ఈ మూవీలో మహిళా ప్రధాన పాత్ర ఉండదట!


తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రకు సంబంధించి దర్శకుడు వశిష్ట కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో చిరు క్యారెక్టర్, హీరోయిన్ రోల్స్ గురించి చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో చిరంజీవి గతంలో ఎప్పుడూ కనిపించని పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ఆయన పాత్ర అత్యంత మెచ్యూర్డ్ గా ఉంటుందన్నారు.  ఈ మూవీలో మహిళా ప్రధాన పాత్ర ఉండదని చెప్పారు. మెగాస్టార్ ను  ఈ తరం ప్రేక్షకులకు మరింత చేరువ చేసే విధంగా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇక ఈ సినిమా భారీ స్థాయిలోరూపొందుతుందని వశిష్ట స్పష్టం చేశారు.


సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి మూవీ


మూడు లోకాలకు, పంచభూతాలకు సంబంధించిన సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మొదటి సినిమా 'బింబిసార' తోనే పీరియాడిక్ డ్రామాను సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఈసారి మెగాస్టార్ తో కలిసి బాక్సాఫీస్ దగ్గర ధూంధాం చేయాలని భావిస్తున్నారట.  అటు ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు ఐశ్వర్యారాయ్ కీలక పాత్రలు పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో మహిళా ప్రధాన పాత్ర ఉండదని దర్శకుడు చెప్పడంతో ఇంతకీ వాళ్లు ఈ సినిమాలో నటిస్తారా? లేదా? అనేది సస్పెన్స్ గా ఉంది. హీరోయిన్ల విషయంలో త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


ఈ ఏడాది చివరలో షూటింగ్ షురూ


ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి చిత్రానికి కీరవాణి సంగీతం అందించబోతున్నారు. 1994లో వచ్చిన 'ఎస్పీ పరశురాం' తర్వాత ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఈ చిత్రంతోపాటు ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో చిరు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మించబోతున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.


Read Also: ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘గా ముక్కు అవినాష్ - హీరోగా వస్తున్న మరో కమెడియన్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial