ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఈ నెల 21 జపాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు జూ. ఎన్టీఆర్, రాంచరణ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. 


కోజిమోను కలవడం గౌరవంగా భావిస్తున్నా!


ఈ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వీడియో గేమ్స్ క్రియేటర్ హిడియో కోజిమాను కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “లెజెండరీ వీడియో గేమ్ క్రియేటర్ కోజిమోను కలవడం సంతోషంతో పాటు గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా వీడియో గేస్, సినిమాలతో పాటు పలు విషయాల గురించి అతడితో మాట్లాడాను. ఈ మెమరీస్ ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి” అని రాజమౌళి ట్వీట్ చేశారు.






రాజమౌళి బహుమతులను అందుకున్న కోజిమో


మరోవైపు రాజమౌళి తనను కలిసిన విషయాన్ని కోజిమా సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాజమౌళి తనకు అందించిన బహుమతుల ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కోజిమా ప్రొడక్షన్స్ స్టూడియోని సందర్శించారని వెల్లడించారు. స్టూడియోలో రాజమౌళి.. ఒక వ్యక్తి యొక్క 3D చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే బాడీ స్కానర్‌ లో కూర్చుని ఉన్న ఫోటోతో పాటు మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు.  “దర్శకుడు S.S రాజమౌళి KJPని సందర్శించారు!!! మేము అతనిని స్కాన్ చేశాం. రాజమౌళి నుంచి నాకు చాలా బహుమతులు లభించాయి. ఈ డిలైటెడ్ బహుమతులు ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీడియో గేమ్స్‌లో రాజమౌళి కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో, జక్కనతో ఆడేసుకోవచ్చన్నమాట అని నెటిజనులు అంటున్నారు. 










అభిమానులతో చెర్రీ దంపతుల విందు, తారక్‌కు ఘన స్వాగతం


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 21 న జపాన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జపాన్ లో పర్యటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు అక్కడి ప్రేక్షకులు, జనాల నుంచి ఓ రేంజిలో గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. రామ్ చరణ్, అతని భార్య ఉపాసన జపాన్ అభిమానులతో కలిసి భోజనం చేయగా, జూనియర్ ఎన్టీఆర్‌కు తను బస చేసిన హోటల్‌లో ఘన స్వాగతం లభించింది.  


Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!