దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మితభాషి. బయట ఎప్పుడూ ఆయన పెద్దగా మాట్లాడరు. కానీ, ‘సౌందర్యలహరి’ కార్యక్రమం ద్వారా ఆయన తన అనుభవాలను ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. మౌనమునిగా ఉండే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే, ఆయనలో ఎప్పుడూ మీరు ఆగ్రహాన్ని చూసి ఉండరు. కానీ, సుధీర్ అభిమానులు ఆయనలో మరో వ్యక్తిని బయటకు చూపించారు. ఎన్నడూలేని విధంగా రాఘవేంద్రరావుకు కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతకీ ఏం జరిగింది?


కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించారు. సునీల్, అనసూయ,  బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ కీ రోల్స్ పోషించారు.ద ఈ నెల 19న ఈ చిత్రం జనాల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడారు. తాజాగా విడుదలైన సీతారామం, బింబిసార, కార్తికేయ-2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయన్నారు. వాటిలాగే కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు వచ్చిన జనాలు రెండున్నర గంటల పాటు మంచి వినోదాన్ని పొందుతారని చెప్పారు. 


రాఘవేంద్ర రావు మాట్లాడిన తర్వాత అనసూయ భరద్వాజ్ మాట్లాడటం మొదలు పెట్టింది. సినిమాకు సంబంధించి తాము పెట్టిన ఎఫర్ట్ గురించి చెప్తుంది. ఇంతలోగా సుడిగాలి సుధీర్ స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పుడే అసలు కథ మొదలయ్యింది. ఆయన స్టేజి మీదకు వస్తున్న సమయంలో ఫ్యాన్స్ అరుపులు మొదలుపెట్టారు. ఓ రేంజిలో కేకలు వేశారు. కొద్దిసేపటి వరకు ఆ ప్రాంతం సుధీర్ అభిమానుల అరుపులతో దద్దరిల్లింది. వెంటనే రాఘవేంద్ర రావు మైకు తీసుకుని.. సుధీర్ ఫ్యాన్స్ కాస్త సైలెంట్ గా ఉండాలని సూచించారు. అయినా వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంత చెప్పినా వినకపోవడంతో రాఘవేంద్ర రావుకు చాలా కోపం వచ్చింది. ‘‘బిహేవియర్ బాగోకపోతే బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వారిని? పెద్దా, చిన్నా లేదా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రావు సీరియస్ కావడంతో ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు. రాఘవేంద్ర రావు ఈ స్థాయిలో కోప్పడ్డం చాలా రేర్ అంటున్నారు సినీ జనాలు. ఆ తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. సుధీర్ సహా ఈ సినిమాలో నటించిన వారంతా మాట్లాడారు. 



ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటించారు. వెన్నెల కిశోర్‌కు జోడీగా విష్ణు ప్రియ, సప్తగిరి సరసన నిత్యశెట్టి, శ్రీనివాస్ రెడ్డికి జంటగా వసంతి నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. చూస్తుంటే.. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను సునీల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకోవడం కోసం ఇతర పాత్రదారులంతా అడవిబాట పడతారు. ఈ చిత్రంలో దాదాపు అంతా కమెడియన్స్, యాంకర్సే ఉన్నారు. 


Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ


Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?