టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్. ఆయన సినిమాలలో కూడా సమాజాన్ని ప్రభావితం చేసే సన్నివేశాలు, డైలాగ్ లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆయన సినిమాలే కాదు నిజ జీవితంలో కూడా ఆయన చెప్పే మాటలు వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో సమాజంలో జరిగే వివిధ అంశాలపై ఆయన స్టైల్ లో తన అభిప్రాయలను చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన రియాక్షన్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఇడియట్’ సినిమా షూటింగ్ సందర్భంలో హీరోయిన్ రక్షిత గురించి చెప్పుకొచ్చారు. 


జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయని, అయితే వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నారు పూరి. ఎంత కష్టం వచ్చినా నిశబ్దంగా రియాక్ట్ అవ్వాలని, అంతే గానీ అరిచి తల గోడకు కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రాబ్లం ఎప్పుడూ ప్రాబ్లం కాదని, మన రియాక్షనే ప్రాబ్లం ను క్రియేట్ చేస్తుందని తెలిపారు. ఏం జరిగినా, బ్యాలెన్స్డ్  గా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలన్నారు. మనకు ఏదైనా కోపం తెప్పించేది జరిగితే అక్కడ నుంచి వెళ్లిపోవడం మంచిదని, లేదా నవ్వుతూ మాట్లాడాలి అంటూ ‘ఇడియట్’ సినిమాలో హీరోయిన్ రక్షితతో జరిగిన ఓ సందర్భం గురించి చెప్పారు. 


‘ఇడియట్’ షూటింగ్ టైమ్ లో ఓ రోజు ఎమోషనల్ సీన్ షూట్ చేస్తున్నామని, అది బాగా ఏడ్చే సీన్, కానీ రక్షిత మాత్రం సీన్ పై ఫోకస్ చేయకుండా నవ్వుతుందని అన్నారు. దాంతో తనకి కోపం వచ్చి ఆమెపై అందరి ముందు అరిచేశానని చెప్పారు. ‘‘నువ్వు ఇలాగే చేస్తే నీకు తరువాత సినిమాలో క్యారెక్టర్ రాయను’’ అని కోపంగా చెప్పారట పూరి. దీనికి రక్షిత స్పందిస్తూ.. ‘నువ్వు రాయి, రాయకపోతే నిన్ను చంపేస్తా.. నెక్స్ట్ నీ పది సినిమాలు నేనే చేస్తా. ముందు నీకు ఏం కావాలో సరిగ్గా చెప్పి చావు’’ అని సమాధానం ఇచ్చిందని చెప్పారు. ఆమె అలా చెప్పడంతో సెట్ లో వాళ్లంతా క్లాప్స్ కొట్టారని, తనకు కూడా కోపం పోయి నవ్వు వచ్చిందని చెప్పారు.  కోపంలో ఉన్నప్పుడు చిరునవ్వుతో సమాధానం ఇస్తే సమస్యను కూడా ఇలా తగ్గించవచ్చని చెప్పుకొచ్చారు పూరీ.






అలాగే సోషల్ మీడియాలో వచ్చే వాటికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు అన్నారు పూరి. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ మనం వైల్డ్ గా రియాక్ట్ అవ్వడం అవసరమా.. పనికొచ్చే వాటికే రియాక్ట్ అవుదాం. సమస్య వచ్చినపుడు నవ్వుతూ చెప్పే సమాధానం లేనప్పుడు, ఓ చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోతే చాలా సమస్యలను పరిష్కరించవచ్చు అని చెప్పుకొచ్చారు పూరి.  ఇక పూరి జగన్నాథ్ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమాను తీశారు. ఈ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేదు. దీంతో విజయ్ తో తీద్దామనుకున్న ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. ప్రస్తుతానికి పూరి తరువాత సినిమాను తన కుమారుడు ఆకాష్ పూరి తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 



Also Read: ‘అవతార్ 2’కు ఎందుకంత క్రేజ్ - ఈ 10 విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ పక్కా!