పుష్పతో సూపర్ సక్సెస్ అందుకుని పాన్ ఇండియా స్టార్‌డం అందుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆయన పాత మిత్రుడు అభినందించారు. ప్రముఖ డైరెక్టర్ మారుతి.. బన్నీని నేరుగా కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర ద్వారా ప్రకటించారు. బన్నీ, మారుతి ఎప్పటినుంచో స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.


‘నా ప్రియతమ, పాత మిత్రుడు ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్‌గా ఎదిగాడు. బాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల మార్కు అందుకోవడం ఆనందంగా ఉంది. పుష్ఫగా తన పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ ఈసారి అవార్డులు కూడా గెలుచుకోవాలని ఆశిస్తున్నాను. తన ప్యాషన్, హార్డ్‌వర్క్‌తో భవిష్యత్తులో ఎన్నో సాధించి.. అందరినీ గర్వపడేలా చేస్తాడు.’ అని ట్వీట్‌లో మారుతి తెలిపారు.


మారుతి ‘ఈరోజుల్లో’ సినిమా తీయకముందు నుంచి వీరిద్దరికీ మంచి స్నేహం ఉండేది. అయితే తన ప్రాణమిత్రుడితో మారుతి ఇంతవరకు సినిమా తీయలేదు. ఈ విషయమై మీడియా కూడా అనేక సార్లు మారుతిని ప్రశ్నించింది. ప్రస్తుతం గోపిచంద్‌తో పక్కా కమర్షియల్ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 20వ తేదీన విడుదల కానుంది.


ఆ తర్వాత ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’ అనే పేరుతో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి కమిటైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యే మంచి కామెడీ సబ్జెక్ట్ కోసం ప్రభాస్ ఎదురు చూస్తున్నాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. మరి మారుతి ‘రాజా డీలక్స్’తో ప్రభాస్‌ను మెప్పించి సెట్స్‌పైకి తీసుకెళ్లగలడా అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి!


ఇక మరోవైపు అల్లు అర్జున్ లైనప్ కూడా మామూలుగా లేదు. త్వరలో పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లనున్న బన్నీ తర్వాతి చిత్రం ఇంకా ఖరారు కాకపోయినా.. అట్లీ, బోయపాటి శ్రీను వంటి పెద్ద డైరెక్టర్లు బన్నీ కోసం లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప తర్వాత బన్నీ ప్రాజెక్టులను ఎంచుకునే విధానం కచ్చితంగా మారినట్లే. ప్రతి సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా చూసుకుంటూ.. ప్రభాస్ తర్వాత నేషనల్ స్టార్‌గా ఎదగడం పైనే బన్నీ దృష్టి పెట్టారు.