రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘రాజు డీలక్స్‘ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ వైపు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్, మారుతి మూవీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీ సైతం పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గురించి, ఈ సినిమా కోసం తాను పడుతున్న కష్టం గురించి మారుతి పలు కీలక విషయాలు వెల్లడించారు.

  


ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నా- మారుతి   


ప్రభాస్ తో చేస్తున్న సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు దర్శకుడు మారుతి తెలిపారు. “నా కెరీర్‌లో ఇంత పెద్ద స్టార్‌కి దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. నా చెమట, రక్తం, కన్నీళ్లను ప్రభాస్‌ సినిమా కోసం ధారపోస్తున్నాను. ఇది నా జీవితంలో లభించిన బెస్ట్ అవకాశంగా భావిస్తున్నాను. అంతేకాదు, ఈ మూవీ నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంత పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయడం నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్‌కి చిన్న విషయం కాదు. నేను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అన్నీ త్యాగం చేసి కష్టపడుతున్నాను” అంటూ మారుతి ఎమోషనల్ అయ్యారు. ’’ప్రస్తుతం ప్రభాసం చాలా సినిమాలు చేస్తున్నారు. నా సినిమా గురించి అప్ డేట్స్ ఇస్తే అభిమానులు కన్ఫ్యూజన్ లో పడే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా గురించి వివరాలు వెల్లడిస్తాం’’ అని చెప్పారు. 


దాదాపు పూర్తైన షూటింగ్


ప్రభాస్ మారుతి సినిమా ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. మిగతా పార్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా విషయంలో ప్రభాస్ కూడా మారుతికి బాగా సహకరిస్తున్నారట. అనుకున్నట్లుగానే షూటింగ్ లో పాల్గొంటున్నారట. ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అందుకుంటుందని ఆయన భావిస్తున్నారట. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రంలో మాళవిక ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఇందులో మార్కెట్ లో విలన్లను చితకబాదుతూ కనిపించింది.


పాన్ ఇండియన్ సినిమాలతో ప్రభాస్ బిజీ


అటు ప్రభాస్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో కల్కి 2898 ఏడీ' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో 'సలార్' సినిమా రూపొందుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మితమవుతోంది. తొలి భాగం ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదలకానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Read Also: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న టబు 'ఖుఫియా' వెనుక కథేంటి? ఆ రబీందర్ సింగ్ ఎవరు?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial