టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి, ఆయన సతీమణి స్పందన కలిసి తాజాగా ‘అలా మొదలైంది’ షోలో పాల్గొన్నారు. వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటికే నిఖిల్ సిద్ధార్థ్, రాజశేఖర్ దంపతులు పాల్గొనగా, తాజాగా మారుతి దంపతులు ఈ షోకు వచ్చారు. మే 9న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మారుతి దంపతులు తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


పెళ్లికి ముందే దొంగతనంగా స్కూటీపై తిరిగే వాళ్లం- స్పందన


పెళ్లికి ముందే ఎవరికీ తెలియకుండా స్కూటీపై తిరిగేవాళ్లమని మారుతి సతీమణి స్పందన  చెప్పారు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నట్లు వెల్లడించారు. 8వ తరగతిలో ఉండగా తన ముఖం నచ్చిందని, 9వ తరగతిలో టాలెంట్ నచ్చిందని, 10కి వచ్చే సరికి తను స్కూల్ నుంచి వెళ్లిపోయాడని చెప్పింది. అప్పట్లో తను ఆర్టీసీ బస్సులతో వస్తే, తాను స్కూటీ మీద వచ్చేదాన్నని చెప్పింది. ఎవరికీ తెలియకుండా దొంగతనంగా స్కూటీ మీద చక్కర్లు కొట్టే వాళ్లమని చెప్పింది.


ఆ వెదవ పనులన్నీ డైరీలో ఉంటాయి- మారుతి


ఒక రోజు విజయవాడ ట్రాఫిక్ లో ఓ వ్యక్తి తన బైక్ ను ఢీకొట్టి వెళ్లిపోయాడని స్పందన చెప్పింది. అక్కడ విరిగి పడిపోయి ఉన్న బైక్ ముక్కలన్నీ ఏరుకుని  తెచ్చి మారుతి భద్రంగా దాచుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత పెళ్లి చూపులు జరిగినప్పుడు స్పందన స్వీట్స్ తీసుకొని వస్తే తాను సగం స్వీట్ తీసుకున్నట్లు చెప్పారు మారుతి. ఫర్వాలేదు మొత్తం తీసుకోండని స్పందన చిన్న వాయిస్ తో చెప్పిందన్నారు. పెళ్లికి ముందు స్పందనకు చక్కగా డైరీ రాసే అలవాటు ఉండేదన్నారు. అందులో నేను రోజూ ఏమేం చేసే వాడినో రాసేదన్నారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేసిన వెదవ పనులన్నీ అందులో ఉంటాయన్నారు.



మారుతి బాగా అలుగుతారు- స్పందన


ఎక్కడికి వెళ్లినా ముందు 15 మినిట్స్ తను సైలెంట్ గా ఉంటుందని, ఆ తర్వాత మనం సైలెంట్ గా ఉండాల్సి వస్తుందని మారుతి చెప్పారు. ఇద్దరిలో తన భార్యే ఎక్కువ మనీ సేవ్ చేస్తుందని చెప్పారు. ఇక అలడగంలో మారుతి తర్వాతే ఎవరైనా అని చెప్పింది స్పందన. ఆయన అలక గురించి మా అమ్మాయి బాగా చెప్తుందన్నారు. తను అలిగితే నా దగ్గరికి వచ్చి మమ్మీ డాడీ అలిగాడు అంటుందని చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మారుతి దంపతులు హ్యాపీగా జాలీగా గడిపారు. కొద్దిసేపు స్కూటీపై భార్యను కూర్చోబెట్టుకుని తిప్పారు మారుతి. మళ్లీ తన పెళ్లికి ముందు రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.  ప్రతి మంగళవారం ‘అలా మొదలైంది’ షో టెలీకాస్ట్ అవుతుండగా, మారుతి దంపతులు పాల్గొన్ని ఈ షో మే 9న ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.






Read Also: అసత్య వార్తలపై శరత్ బాబు కుటుంబ సభ్యుల ఆగ్రహం, కేసు పెడతామని హెచ్చరిక